అడ్డగోలు నిర్ణయాలు ఆపండి
అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్, కొరముట్ల
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని మంగంపేట బెరైటీస్ విక్రయాల విషయంలో అడ్డగోలు నిర్ణయాలు సరైనవి కావని, ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది రోడ్డుపాలు కావాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ఏకపక్ష చర్యలతో కార్మికుల పొట్టకొట్టవద్దని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.
మంగంపేటలో లభ్యమయ్యే బెరైటీస్ ఖనిజం కారణంగా సుమారు 200 చిన్నతరహాపరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. భూనిర్వాసితులు, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2004లో జీఓ నెంబర్ 296ను విడుదల చేసింది. 40ః60 నిష్పత్తిన ఖనిజాన్ని స్థానిక పరిశ్రమలు, ఎగుమతికి కేటాయింపులు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు, మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్డున పడనున్న కార్మికులు: ఎమ్మెల్యే కొరముట్ల....
రాష్ట్ర ప్రభుత్వం జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని జీవిస్తున్న 20వేల మంది కార్మికులు రోడ్డు పాలుకానున్నారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అని చంద్రబాబు ప్రకటనలు ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు. చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పిన వారిలో భూ నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు.