సై ఖతం


తాడేపల్లి రూరల్ : ఆ ఇసుక క్వారీకి అనుమతులు రాలేదు. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయలేదు. అధికారికంగా ధ్రువీకరించ లేదు. ఏ వెబ్‌సైట్‌లోనూ వివరాలు లేవు. అయినా.. జిల్లాలోని ఓ అధికార పార్టీ శాసనసభ్యుడి అండతో ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎవరైనా అడ్డొస్తే బెదిరించేందుకు స్థానిక రౌడీషీటర్ల సహకారం తీసుకుంటున్నారు.

 

 వివరాలను పరిశీలిస్తే... మండల పరిధిలోని ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట జీరో పాయి ంట్ ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధుగణం తెరలేపింది. అనుమతులు వచ్చేశాయని ప్రచారం చేసుకొని ఏకాదశినాడు పూజలు చేసి తవ్వకాలు ప్రారంభించారు.

 

  అయితే ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో ఆ క్వారీ నిర్వహణకు సంబంధించి ఎక్కడా వివరాలు లేకపోవడం, సంబంధిత జీవో కాపీలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఈ రీచ్‌కు సంబంధించి ఎండీవో, తహశీల్దార్ కార్యాలయాలతోపాటు ఇతర అధికారులకు ఏ విధమైన అధికారిక పత్రాలు అందకపోవడంతో అనుమా నాలు బలపడుతున్నాయి. ఈ క్వారీని డ్వాక్రా మహిళల నేతృత్వంలో నడపాలి. సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలి. ఇవేవీ లేకుండా ఇసుక తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకులు అధికార పార్టీ ఎమ్మెల్యేకు స్వయానా తమ్ముడు, వేలు విడిచిన బామ్మర్దులు కావడం విశేషం.

 

 వీరి అక్రమాలకు ఎవరూ అడ్డురాకుండా మత్స్యకారుల సొసైటీ ముసుగులో రౌడీషీటర్లను ఇసుక డంప్ చేసే ప్రాంతంలో ఉంచారు. స్థానిక మత్స్యకారులు నోరు మెదపకుండా ఉండేందుకు వారిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరోవైపు బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై 2012లో భారీ వాహనాలను నిషేధించారు. ప్రస్తుత ఇసుక క్వారీ నిర్వాహకులు ఇదే వంతెనపై రాకపోకలు సాగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈ క్వారీని ఉండవల్లి డ్వాక్రా మహిళలకు కాకుండా నిర్వాహకులకు అనుకూలంగా ఉన్న పెనుమాక మ్యాక్స్ సొసైటీకి వచ్చే విధంగా ఓ మంత్రితో సిఫార్సు చేయించుకున్నట్టు సమాచారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top