ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి
29 బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలి
వ్యాపారవర్గాల సమావేశంలో అంబటి
సత్తెనపల్లి : ప్రత్యేక హోదా సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్నో కీలక పరిశ్రమలకు రాయితీలు లభిస్తాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పట్టణంలోని ది క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో గురువారం వ్యాపార వర్గాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ కారణాలతో నాడు రాష్ట్ర విభజన జరిగిందని, ఇందుకు కాంగ్రెస్ను మాత్రమే తప్పపట్టడానికి లేదన్నారు. కాంగ్రెస్కు నాడు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా సహకరించాయన్నారు. అధికారంలోకి వచ్చి 14 మాసాలు గడిచినా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాచివేత ధోరణి అవలంబిస్తున్నాయన్నారు.
ప్రత్యేక హోదా వస్తే పన్నుల రాయితీలు, కీలకమైన పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా సాధనకు రాజకీయాలు పక్కనపెట్టి 29న జరిగే రాష్ట్ర బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్కు సీపీఎం, సీపీఐ కూడా పూర్తి మద్దతు పలికాయన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి గార్లపాటి ప్రభాకర్, పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుర్ మీరాన్, వివిధ వ్యాపార వర్గాల అసోసియేషన్ బాధ్యులు కాపుగంటి శ్రీవెంకటరత్నం, పెరుమాళ్ల లక్ష్మీశివనారాయణ, అన్నం వెంకట రామారావు, గిరి, భవిరిశెట్టి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ నేతలు కొమ్మారెడ్డి చెంచిరెడ్డి, ఎంవీ సుబ్బారెడ్డి, కళ్ల వీర భాస్కరరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చల్లంచర్ల సాంబశివరావు మాట్లాడారు. పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.