తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం

తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభం - Sakshi


అడ్డుకున్న లచ్చన్నపాలెం గ్రామస్తులు

పోలీసుల సాయంతో కొనసాగుతున్న పనులు


 

లచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఎట్టకేలకు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ  పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను స్థానికులు మళ్లీ అడ్డుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో కాంట్రాక్టర్ పనులను కొనసాగిస్తున్నారు. మండలంలోని లచ్చన్నపాలెం సర్పానదిలో రూ.ఏడు కోట్ల వ్యయంతో భారీ తాగునీటి ప్రాజెక్టును నిర్మించతలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల తమ ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని భావించిన గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తున్నారు.



మూడు రోజుల క్రితం ప్రారంభించిన ఈ పనులను అడ్డుకున్నారు.  దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడంతో మళ్లీ గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గ్రామస్తులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఈ పనులను అడ్డుకుంటే కేసులు తప్పవని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించడంతో చేసేదిలేక వారు అడ్డుతొలగారు.



దీంతో పనులు యథావిధిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నదిలో ట్యాంకు నిర్మాణానికి తీసిన ప్రాంతంలో ఉన్న నీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ పనులను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ పర్యవేక్షిస్తున్నారు.



 కోర్టును ఆశ్రయించేందుకు సన్నాహాలు

తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటితోపాటు పాడిపరిశ్రమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లచ్చన్నపాలెం గ్రామస్తులు అనేక సార్లు పనులు అడ్డుగించారు. ఇక్కడ ప్రాజెక్టు వద్దని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో  కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమవుతున్నారని తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top