నేటి నుంచి తిరుపతమ్మ చిన్నతిరునాళ్లు


పెనుగంచిప్రోలు (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్ల మహోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు కృష్ణా, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ఈఓ చందు హనుమంతరావు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపకాంతులతో అందంగా ముస్తాబు చేశారు.



గురువారం ఉదయం 5.31 గంటలకు జరిగే అఖండజ్యోతి స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శుక్రవారం నిత్య కల్యాణమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అనంతరం సామూహిక లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. ఏడో తేదీ సాయంత్రం చిన్న తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన శ్రీతిరుపతమ్మ అమ్మవారి పుట్టినిల్లు అనిగండ్లపాడు నుంచి పసుపు, కుంకుమల బండ్లు పెనుగంచిప్రోలు ఆలయానికి చేరుకుంటాయి. ఎనిమిదో తేదీ సాయంత్రం శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మ రథోత్సవం, తొమ్మిదో తేదీ సాయంత్రం 90 అడుగుల దివ్య ప్రభోత్సవంతో తిరునాళ్లు ముగుస్తాయని ఈవో వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top