వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ నవమి మరుసటి రోజు ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. సాయంత్రం సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారికి విశేష సమర్పణ చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం రాత్రి 8 గంటల నుంచి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వారాంతపు సెలవుల వల్ల తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 51,942 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 12 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించింది.
గదుల కోసం, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టల్లో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నిర్వహించిన శ్రీవారి హుండీ లెక్కింపుల్లో రెండు కోట్ల 94 లక్షల రూపాయలు లభించాయి.