స్పైస్జెట్ విమానాన్ని ఆపేసిన గద్ద
విమానాలకు టైం బాగున్నట్లు లేదు. వరుసపెట్టి వారం రోజుల్లోనే నాలుగు ప్రమాదాలు సంభవించాయి. మూడు విమానాలు, ఒక హెలికాప్టర్ పడిపోయాయి. తాజాగా మళ్లీ రాజమండ్రిలో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం త్రుటిలో తప్పింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం టేకాఫ్ తీసుకుంటుండగా, ఓ గద్ద వచ్చి ఆ విమానం రెక్కను ఢీకొంది. దాంతో హైదరాబాద్ బయల్దేరకుండా రాజమండ్రి విమానాశ్రయంలోనే నిలిచిపోయింది.
ఈ విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి నుంచి బయల్దేరాలి. ఇంజన్లో పక్షి భాగాలు ఇరుక్కుపోవడంతో దాన్ని పరిశీలించడానికి ఇంజనీర్లను పిలిపించారు. సమయం ఎక్కువ పడుతుందని తెలియడంతో సర్వీసు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొంతమందిని రోడ్డు మార్గం గుండా గన్నవరం పంపారు. మిగిలినవారు మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్కు మూడు విమానాలు బయల్దేరతాయి.