ప్రత్యేక హోదా సాధ్యం కాదు: పురందేశ్వరి
భోగాపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోనున్న బెరైడ్డిపాలెం, రెడ్డికంచేరు గ్రామాల ప్రజలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సోమవారం ఆమె వచ్చారు.
ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ... మున్ముందు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. అయితే ఆ స్థాయిలో రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తమను కలిసేందుకు వచ్చిన పురందేశ్వరితో ఎయిర్పోర్టుకు భూములిచ్చేది లేదని ఆయా గ్రామాల రైతులు తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా తమను ఆదుకోవాలని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ... ఎయిర్పోర్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కలెక్టరుతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.