రాబడి పెంచుతాం.. వాటా ఇస్తారా?

రాబడి పెంచుతాం.. వాటా ఇస్తారా?


ఆర్టీసీకి స్పెయిన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతిపాదన

బస్సులు, సిబ్బంది సేవల గరిష్ట వినియోగానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్

ఆర్టీసీ ఎండీతో కంపెనీ ప్రతినిధుల భేటీ

ప్రయోగాత్మకంగా ఓ రూటు అప్పగించేందుకు అంగీకారం




సాక్షి, హైదరాబాద్: అదో సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ... అంతర్జాతీయంగా రవాణారంగంలో దాని ఉత్పత్తులకు మంచి పేరుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల రవాణా సంస్థగా గుర్తింపు పొంది గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీని ఇప్పుడు ఆశ్ర యించింది... తాను రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వాడితే సంస్థ రాబడులు పెరుగుతాయని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను అమ్మినందుకు కంపెనీలు దాని ఖరీదును వసూలు చేసుకోవటం సహజం. కానీ, తన సాఫ్ట్‌వేర్ వాడటం వల్ల పెరిగిన రాబడిలో తనకు వాటా ఇమ్మని అడుగుతోంది.



ఇదీ సంగతి...

దాదాపు 22 వేల బస్సులను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో లాభాలు పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆధునిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుంటోంది. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టంను ఏర్పాటు చేసుకునేందుకు ఇటీవల స్పెయిన్‌కు చెందిన ట్రైమాక్స్ అనే సంస్థ సాఫ్ట్‌వేర్‌ను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న గోల్ సిస్టమ్స్ అనే సంస్థ తాజాగా ఆర్టీసీని సంప్రదించింది.



వాహనాలను గరిష్ట స్థాయిలో వినియోగించటం, వాటి డ్రైవర్ల పనివేళలను సమర్థంగా వాడుకునేందుకు వీలుగా తాము ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను రూపొందించామని, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు వాటిని వాడుకుని రాబడులను పెంచుకున్నాయని,  ఏపీఎస్‌ఆర్టీసీ కూడా దాన్ని వినియోగిస్తే రాబడులు భారీగా పెరుగుతాయని గట్టిగా పేర్కొంది. బుధవారం ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి తమ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకతలను వివరించారు.



ఒక ప్రాంతం నుంచి వచ్చిన బస్సు తిరిగి మరో గమ్యస్థానానికి వెళ్లేప్పుడు దాని వినియోగం గరిష్ట స్థాయిలో ఉండాలంటే కొన్ని ప్రత్యేక మెళకువలు అనుసరించాలని, వాటి  ఆధారంగానే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు వెల్లడించింది. ఒక ట్రిప్పునకు మరో ట్రిప్పునకు మధ్య ఖాళీగా ఉండే సమయాన్ని కుదించటంతోపాటు ఆ బస్సును వచ్చిన ప్రాంతానికి కాకుండా మరో ప్రాంతానికి పంపటం, మరో బస్సును ఇటువైపు తిప్పటం లాంటి వాటి ద్వారా బస్సు వృథాగా ఉండే సమయాన్ని తగ్గించటం లాంటి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొంది.



ఆర్టీసీలో ఓ మార్గాన్ని తమకు కేటాయిస్తే రాబడులు ఎలా పెరుగుతాయో ప్రయోగాత్మకంగా చేసి చూపనున్నట్టు తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో ఓ రూట్‌ను దానికి కేటాయిస్తున్నట్టు ఎండీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఆ మార్గంలో తమ సాఫ్ట్‌వేర్ ద్వారా రాబడులు పెంచి చూపుతామని, ప్రయోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని పేర్కొంది. అయితే తమ సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తే దాని వల్ల పెరిగిన రాబడిలోంచి వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కాగా, ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రూట్లలో దాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top