మరికొన్నాళ్లు ఎండలే
విశాఖపట్నం: వర్షాలు కురవాల్సిన సమయం ఆగస్టు నెలాఖరులోనూ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో నెల వరకు ఈ పరిస్థితి తప్పదంటున్నారు విశాఖపట్నంలోని వాతావరణశాఖ నిపుణులు. ఇప్పటివరకు పలుసార్లు అల్పపీడనం ఏర్పడ్డా వర్షాలు కురవకపోవడం, ఎల్నినో ప్రభావం, సూర్యుడు భూమికి ఇంకా దగ్గరగానే కొనసాగుతున్నందున మరో నెల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంటున్నారు.
సెప్టెంబర్ 22నాటికి సూర్యుడు భూమధ్యరేఖ మీదకు వస్తాడని అప్పటినుంచి చల్లనివాతావరణం ఎక్కువకాలం కొనసాగుతుందని చెబుతున్నారు. గత రెండురోజులతో పోలిస్తే రాష్ట్రంలో శనివారం ఉష్ణోగ్రతలు 35లోపే నమోదయ్యాయని వివరిస్తున్నారు. అయితే పశ్చిమతీరంలోని అరేబియన్ సముద్రంలో తాజాగా అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ అధికారులు గుర్తించారు. దీనిప్రభావంతో ముంబయి, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో మాత్రం పొడివాతావరణం కొనసాగుతుందని పేర్కొంటున్నారు.