విచ్చలవిడిగా బెల్టుషాపులు

విచ్చలవిడిగా బెల్టుషాపులు


రోడ్లపై పొర్లుతున్న మందుబాబులు

 

కంచికచర్ల :  గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులు నిర్వహించటంతో మధ్యం బాబులు ఫుల్‌గా తాగి రోడ్లుపైనే దొర్లుతున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లుతున్న ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లోని బెల్టుషాపులు రద్దు చేస్తామని, ఆడపడుచుల కన్నీళ్ళు తుడిచేందుకు తమ పార్టీ  అండగా నిలుస్తుందని పూర్తిగా మహిళలకు అన్ని విధాల తమ పార్టీ సహకరిస్తుందని, మద్యానికి బానిసై మగవాళ్ళు ఇళ్ళల్లోని భార్యాపిల్లలను చూడటంలేదని అందుకే బెల్టుషాపులన్నీటిని తొలగిస్తామని నాయకులు అనేక ప్రకటనలు, ఉపన్యాసాలు ఇచ్చారు,  టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు మాటపై నిలబడే నాయకుడని నమ్మకంతో  రాష్ట్రంలోని గ్రామాల్లోని ఎక్కువశాతం మహిళలు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారం చేజిక్కిచ్చుకున్న టీడీపీ ప్రభుత్వం మాట మీద నిలబడలేదు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు సమీపిస్తున్నా టీడీపీ ప్రభుత్వం నేటికి బెల్టుషాపులను రద్దు చేయకపోగా, మరిన్ని బెల్టుషాపులు వెలిశాయని ప్రజలు వాపోతున్నారు.  మద్యంబాబులకు ఎక్కడపడితే అక్కడే మందు దొరకటంతో బడి, గుడి అని చూడకుండా పీకలదాక మందుతాగి రోడ్డుపై దొర్లుతున్నారు.



ఈ తంతును చూసిన ప్రజలు మాత్రం టీడీపీ ప్రభుత్వంలో తాగునీరు కొరత ఉంటుందేమోకాని మద్యానికి ఏ మాత్రం కొరత రానీయరని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాత్రి 11 గంటల సమయంలోనూ లెసైన్సు ఉన్న మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మద్యం షాపుల నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లెసైన్సు ఉన్న మద్యం షాపుల్లో ఎంఆర్పీ కన్నా రూ.15లు అదనంగా మద్యం విక్రయిస్తున్నారు. అదేమంటే నీ ఇష్టం ఉంటే కొను లేకపోతే వెళ్లిపో అని మద్యం ప్రియులను షాపుల్లో పనిచేసే సిబ్బంది బెదిరిస్తున్నారు.  రశీదు ఇవ్వమంటే ఇవ్వటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

మండలంలో 100కు పైగా బెల్టుషాపులు


మండలంలోపలు గ్రామాల్లో 100కు పైగా బెల్టుషాపులున్నాయి. ఒక్కో గ్రామంలో 10 నుంచి 15 వరకు ఉన్నాయి. మద్యం ఎంఆర్పీ ధర కన్నా రూ. 20 నుంచి రూ.25 లకు మద్యం బాటిల్‌ను విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో బెల్టుషాపులు కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టుషాపులను రద్దు చేయాలని దీంతోపాటు లెసైన్సులున్న షాపుల్లో ఎంఆర్పీకన్నా అధిక ధరకు విక్రయిస్తున్న దుకాణాల లెసైన్సులను రద్దు చేయాలని పలు గ్రామాల మహిళలు కోరుతున్నారు.

 

బెల్టుషాపులు లేవు

గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్టుషాపుల విషయమై ఎక్సైజ్ ఎస్‌ఐ కృష్ణవేణిని వివరణ కోరగా గ్రామాల్లో బెల్టుషాపులు లేవని తెలిపారు. లెసైన్స్ దుకాణాల్లో మద్యం ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే షాపు నిర్వహకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 -కృష్ణవేణి, ఎక్సైజ్ ఎస్‌ఐ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top