స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలి

స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలి


 ప్రకాశ్‌నగర్ (రాజమండ్రి) :స్మార్ట్ సిటీ జాబితాలో రాజమండ్రి నగరాన్ని కూడా చేర్చాలని కార్పొరేటర్లు మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణను కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికైన మేయర్, కార్పొరేటర్లను కలుసుకున్నారు. ఆ సందర్భంగా మేయర్ మినీ కాన్ఫరెన్స్ హాలులో మంత్రితో కలసి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నగరాభివృద్ధికి, నగరపాలక సంస్థలో తీసుకురానున్న సంస్కరణలను గురించి మంత్రి నారాయణ వివరించారు. నగరంలో మంచి ప్రాజెక్టులు చూపిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చేస్తామన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

 

 రాజమండ్రి టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్‌లైన్ చేస్తామన్నారు. దీని ద్వారా నగరంలో ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి... నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉన్నాయా లేదా... ప్లాన్ అప్రూవల్ ప్రకారమే నిర్మించారా లేదా అనే తదితర విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. అలాగే ఏ ఫైల్ ఎవరి వద్ద ఉందో ఆ ఫైల్‌కు కేటాయించే ప్రత్యేక కోడింగ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జీపీఆర్‌ఎస్ ద్వారా చిత్రాలను కూడా చూడొచ్చని తెలిపారు మున్సిపల్ శాఖ వెబ్ సైట్‌కు అనుసంధానం చేస్తూ ప్రతి కార్పొరేటర్‌కు వ్యక్తిగత లాగిన్ ఐడీలు ఇస్తామని మంత్రి నారాయణ చెప్పారు.

 

 ఈ లాగిన్ ఐడీ ద్వారా ఏ కార్పొరేషన్‌కు చెందిన ఆ కార్పొరేటర్ వారి సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు... టెండర్ల ప్రక్రియ... సంస్థకు సంబంధించిన ప్రతి పని ప్రగతిని తమ డివిజన్‌తో సహా వివరాలు చూసుకునే అవకాశం ఉంటుందన్నారు.  కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు వచ్చే నెల 4,5,6 తేదీల్లో, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వచ్చే నెలాఖరులో హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. మరో 15 రోజుల్లో తాను మళ్లీ రాజమండ్రి వస్తానన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top