వడదెబ్బతో ఆరుగురు మృతి
సాక్షి నెట్వర్క్ : జిల్లాలో వడదెబ్బతో శనివారం ఆరుగురు మృతి చెందారు. బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన సాలమ్మ(37) శుక్రవారం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లి వడగాల్పులతో స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం ఉదయం ఆస్పత్రిలోనే మృతి చెందింది. కర్నూలు సమీపంలోని జొహరాపురానికి చెందిన నాగమద్దిలేటి (49)..శుక్రవారం పొలం పనికి వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు.
గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. నందవరం మండలం ముగతి గ్రామ సర్కిల్లో ధర్మారెడ్డి(65) అనే వృద్ధుడు వడదెబ్బతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఇతను మంత్రాలయం మండలం సూగూరు గ్రామ వాసి. ఎమ్మిగ నూరులో పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యలో ముగతి గ్రామంలో ఆగాడు. ఎండవేడిమికి అక్కడే స్పృహతప్పి పడిపోయాడు.
తీరా చూస్తే ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామానికి చెందిన గడ్డ సుబ్బారాయుడు(62), చాగలమర్రిలోని బుగ్గరస్తా కాలనీకి చెందిన లాల్బాషా(41) కూలీ పనులకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. చికిత్స పొందు తూ ఇద్దరూ శనివారం మృతి చెందారు.
మాజీ ఎంపీటీసీ సభ్యుడు..
మంత్రాలయం మండలం సూగూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధర్మారెడ్డి(60) శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఎంపీపీ జి.రాజేశ్వరి సంతాపం తెలిపారు. ధర్మారెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు.