అనంతపురంలో వోల్వో బస్ దగ్ధం
అనంతపురం : అనంతపురంలో వోల్వో బస్ అగ్నికి ఆహుతయ్యింది. హైదరాబాద్ నుంచి కేరళ వెళ్తున్న వోల్వో బస్సు గార్లె దిన్నె మండలం తిమ్మపేట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటాక దగ్ధమైంది. ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన కోసం బస్సుని నిలుపగా బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై అలారం మోగించడంతో ప్రయాణీకులకు పెను ప్రమాదం తప్పింది. 35మంది ప్రాణాలతో బయట పడ్డారు.
ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణీకుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగాయని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఈ బస్సు కేరళలోని కల్లాడ ట్రావెల్స్కు చెందిన బస్సుగా సమాచారం. కాగా విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న మంత్రి పరిటాల సునీత ప్రమాద విషయాన్ని తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టూరిస్టులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.