తెలుగు తమ్ముళ్లూ మాతో కలుస్తారా..
-
ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం
విశాఖపట్నం, న్యూస్లైన్: వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల ప్రసంగం తెలుగు తమ్ముళ్లను ఆలోచింపజేసింది. గురువారం ఆమె తన తల్లి విజయమ్మ వెంట నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కు చేరుకునే సమయానికి టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలతో కలెక్టరేట్ ఆవరణ సందడిగా ఉంది. ఈ సన్నివేశాన్ని చూసిన షర్మిల వారిని ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో షర్మిల చెబుతున్న వాస్తవాలను టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు మండుటెండలో సైతం కూల్గా ఆలకించాయి.
ఎండను సైతం లెక్కచేయకుండా తెలుగు తమ్ముళ్లు నా ప్రసంగం విన్నందు కు కృతజ్ఞతలంటూ వారిని అభినందించడం కొసమెరుపు. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమంటూ కాంగ్రెస్ శ్రేణులకు గుర్తు చేస్తూనే, వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ఉన్న టీడీపీ శ్రేణులతో తెలుగు తమ్ముళ్లు మీరు కూడా వైఎస్సార్సీపీతో కలిసిపోతున్నారా? అంటూ సమయస్ఫూర్తితో వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
వైఎస్సార్సీపీలోకి చంద్రబాబుకు నో ఎంట్రీ అంటూ మీరు మా సోదరులే మీకు మాత్రం ప్రవేశముందంటూ వారిని ఉత్సాహపరిచారు. వైఎస్ మీద ప్రేమ ఉంటే విజయమ్మను విశాఖ నుంచి అధిక మెజార్టీతో గెలిపించాలంటూ షర్మిల చేసిన అభ్యర్థనకు పార్టీ శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది.