ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి
బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం
బాలిక ఏడుపు విని కనుక్కున్న మేకల కాపరి
పలమనేరు : బడినుంచి ఇంటికెళ్తున్న రెండో తరగతి బాలికను ఓ గుర్తు తెలియని యువకుడు మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన సంఘటన బుధవారం సాయంత్రం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. బాధుతుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన దంపతులు గ్రామ సమీపంలోని పొలం వద్ద కాపురం ఉంటున్నారు. వారి కుమార్తె (7) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.
బుధవారం పాఠశాల కెళ్లి సాయంత్రం పొలం వద్ద ఉన్న ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఓ యువకుడు మోటార్ సైకిల్పై వచ్చి ఆ పాపను బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడిచేసి వెళ్లి పోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తూ ఉన్న బాలికను అడవిలో మేకలు మేపేవారు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఇల్లు చేరని తమ కుమార్తె కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు గ్రామస్తులను వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్లి బాలికను స్థానిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స అనంతరం బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. నిందితుడి కోసం పోలీసులు విచారిస్తున్నారు.