ఆశ్లీల వేధింపులు ఆపై దాడి


► ఎస్పీకి ఫిర్యాదు చేసిన దంపతులు

విజయనగరం కంటోన్మెంట్‌ : బాత్‌ రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడమేగాకుండా... పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినందుకు దాడి చేసి గాయపర్చారని జిల్లాలోని జామి మండలం బలరామపురానికి చెందిన దంపతులు సోమవారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.


అనంతరం వారు ఫిర్యాదు వివరాలను విలేకరులకు తెలిపారు. బలరామపురంలో తమ పక్కింట్లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి యామలి శ్రీనివాసరావు తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీసి నెట్‌లోనూ... వాట్సాప్‌లోనూ పెడతానని లైంగికంగా తనను లొంగదీసుకున్నాడని పేర్కొన్నారు. రానురాను ఆ వేధింపులు ఎక్కువవడంతో ఇటీవల జామి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రాజీ చేసి ఆ మేరకు ఓ పత్రాన్ని రాయించి పంపించేశారని తెలిపారు.


దానిని కూడా ఉల్లంఘించి ఈ నెల 9న తన ఇంటికి వచ్చి తన భర్త మెడపై బ్లేడుతో తీవ్రంగా గాయ పర్చాడని, నిద్రలో ఉన్న తాను భర్త కేకలు  విని లేచి అడ్డుకోబోగా తనపైనా హత్యా యత్నం చేశాడని విలపించారు. సమీపంలో ఉన్న వారు వచ్చి శ్రీనివాసరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని తెలిపారు. అయితే ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేశారనీ... ఆయనవల్ల తమకు ప్రాణ నష్టం ఉందనీ, తమకు రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కలసి విన్నవించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top