కిరణ్, బాబులపై సీమాంధ్ర నేతల మండిపాటు

కిరణ్, బాబులపై సీమాంధ్ర నేతల మండిపాటు - Sakshi


సాక్షి, హైదరాబాద్: విభజన విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ముందే తెలుసా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాలలో ఉన్న వారిద్దరూ, అన్ని విషయాలూ ముందే తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా మౌనం దాల్చారా? రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న కనీవినీ ఎరుగని సంక్షోభానికి అదే కారణమైందా? పైగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలే వారి మౌనానికి కారణమా? అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు టీడీపీలోనూ ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. విభజన నిర్ణయం వెలువడ్డాక ఏకంగా తొమ్మిది రోజుల పాటు కిరణ్ మౌనముద్రకు పరిమితమవడం, బాబు కూడా కొద్ది రోజుల తర్వాత నింపాదిగా స్పందించడమే గాక సీమాంధ్రకు నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే చాలంటూ మాట్లాడటం వెనక ఉన్నదంతా ఢిల్లీ స్క్రిప్టేనంటున్నారు.

 

 ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోబోమని తనను కలిసిన వారితో సోనియాగాంధీ స్పష్టంగా చెబుతుండటంతో ఇరు పార్టీల నేతలూ  నిరాశలో కూరుకుపోయారు. ‘‘విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే ‘ఆ ఇద్దరూ’ అడ్డు చెప్పి ఉండాల్సింది. అలా చేయకుండా ఇప్పుడు పైపైన హడావుడి చేయడం వల్ల లాభమేముంది? కిరణ్, బాబు ముందుగానే అడ్డుపడి ఉంటే ఇంతదాకా వచ్చేదే కాదు’’ అంటూ వారంతా వాపోతున్నారు. తాజాగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో జరిగిన భేటీలో కిరణ్ ధోరణి కూడా ఆద్యంతం ఉత్తుత్తి హడావుడినే తలపించిందని అందులో పాల్గొన్న నేతలే చెబుతున్నారు. పైగా ఇటు కిరణ్, అటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో గందరగోళాన్ని పెంచజూడటం తమను నివ్వెరపరిచిందని వారన్నారు. విభజన నిర్ణయంపై పునరాలోచన లేదని, ఆంటోనీ కమిటీకీ దానికీ సంబంధం లేదని అధిష్టానం కుండబద్దలు కొట్టిందని భేటీలో బొత్స చెప్పడం తెలిసిందే. కిరణ్ మాత్రం ఇంకా ఏమీ మించిపోలేదని, విభజన ప్రక్రియ పది శాతం కూడా జరగనే లేదని, ఆంటోనీ కమిటీకి గట్టిగా సమైక్య వాదన విన్పిద్దామని చెబుతూ నేతలను అనునయించజూశారు.

 

 చూస్తుంటే ఇదంతా అధిష్టానంతో కలిసి తమతో కిరణ్ ఆడుతున్న గేమ్‌గానే కన్పిస్తోందని భేటీలో పాల్గొన్న సీనియర్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఇక తొలుత విభజనను సమర్థిస్తూ మాట్లాడిన బాబు, సీమాంధ్ర భగ్గుమనడంతో నాలుక్కరుచుకుని హడావుడిగా నష్ట నివారణ చర్యలకు దిగారని టీడీపీ నేతలంటున్నారు. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవాను తట్టుకునేందుకు ఏదో ఒకటి చేయక తప్పదంటూ పార్టీపరంగా ఒత్తిళ్లు పెరుగుతుండటంతో సంపాదకులతో భేటీ తదితరాల పేరుతో కొద్ది రోజులుగా నామమాత్రపు హడావుడితో బాబు సరిపెడుతున్నారంటూ వాపోతున్నారు. మరోవైపు అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్టు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించడంతో మరేం చేయడానికీ దిక్కు తోచక అదే దీక్షను తమతో అధినేత కాపీ కొట్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు.

 

 విజయమ్మ దీక్ష తలపెట్టిన విజయవాడలోనే తానూ దీక్ష చేస్తానంటూ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమ ప్రకటించడం తెలిసిందే. అక్కడ అనుమతి రాకపోవడంతో విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మారగానే ఆ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కూడా తాను దీక్ష చేస్తానని హడావుడిగా ప్రకటించారు. ఇదంతా బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కాపీయింగేనని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అటు బాబు, ఇటు కిరణ్ అసలు సమయంలో మౌనం దాల్చి, ఇప్పుడిలా ఉత్తుత్తి హడావుడి చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండబోదంటూ ఆ పార్టీల నేతలు మండిపడుతున్నారు. ‘‘విభజన దిశగా సీడబ్ల్యూసీలో నిర్ణయం జరగకముందే అడ్డుకునే శక్తి ఉండి కూడా వారిద్దరూ అలా చేయలేదు. ఇప్పుడిక ఎన్ని చెప్పినా లాభం లేదు. సారథులుగా ఉంటూ మాలాంటి నేతల భవిష్యత్తును చేజేతులా అంధకారంలోకి నెట్టేశారు’’ అంటూ దుయ్యబడుతున్నారు.

 

 ఆనాడే స్పందించి ఉంటే...

 ముఖ్యంగా చంద్రబాబైతే నాలుగేళ్లుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ కూడా విభజన పట్ల అభ్యంతరం చెప్పలేదని, కనీసం నిర్ణయం తీసుకున్న తర్వాతైనా అందుకు వ్యతిరేకంగా స్పందించలేదని టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కిరణ్ సర్కారుపై మిగతా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజే, దానికి మద్దతిద్దామని తామెంత చెప్పినా, ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేదే లేదు’ అని బాబు కరాఖండిగా చెప్పడమే గాక దాన్ని ఒంటి చేత్తో కాపాడారని గుర్తు చేస్తూ మండిపడుతున్నారు. ఆ రోజు అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తే అస లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది కాదనీ, ఈ పరిస్థితి కూడా వచ్చేదే కాదని ప్రైవేటు సంభాషణల్లో వారంతా గగ్గోలు పెడుతున్నారు. టీడీపీకి సీమాంధ్రలో 45 మంది ఎమ్మెల్యేలున్న విషయం తెలిసిందే. విభజన నిర్ణయం వెలువడ్డాకైనా ‘ప్రభుత్వాన్ని పడగొడతాం’ అని చెప్పినా, డొంకతిరుగుడుమాని స్పష్టమైన వైఖరి తీసుకున్నా మిగతా పార్టీల్లో కదలిక వచ్చేదని, అసెంబ్లీ మనుగడే ప్రశ్నార్థకమయ్యేదని టీడీపీ నేతలంటున్నారు. అదేదీ చేయకుండా కాంగ్రెస్ పెద్దలతో సంబంధాల కారణంగా వారు చెప్పినట్టల్లా బాబు నడుచుకుంటున్నారంటూ తూర్పారబడుతున్నారు.

 

కిరణ్ మనసేమిటో!: విభజన వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత కిరణ్ మాట్లాడినా, తెలంగాణ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారని గట్టిగా విశ్వసించే పరిస్థితులు అసలే లేవని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే భావిస్తున్నారు. ఆయన అధిష్టానం బాటలోనే నడుస్తున్నారని, కాకపోతే సీమాంధ్రలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగొద్దనే ఉద్దేశంతోనే విభజనను తాను స్వాగతించడం లేదని ప్రకటన చేశారని అంటున్నారు. ఇందులో సీమాంధ్రలో తానే హీరోనవ్వాలన్న ఉద్దేశమే కన్పిస్తోందని, అలాగాక నిజంగా విభజనకు కిరణ్ వ్యతిరేకే అయ్యుంటే ఆయన ఎత్తుగడలే వేరేగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ‘‘విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతోందని కిరణ్‌కు ముందే తెలుసు.

 

అయినా అవకాశముండి కూడా ఆ ప్రక్రియను అడ్డుకోలేకపోయారు. ఆయన అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారనేందుకు ఇదే తార్కాణం. ఎందుకంటే విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నా కిరణే వారించారు’’ అని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఆ రోజే తాము రాజీనామాలు చేసినా ఇంత జరిగేది కాదంటున్నారు. ‘‘సీమాంధ్రలో కాంగ్రెస్‌కు 97 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికైనా వారిలో 20, 30 మంది నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామంటూ నోటీసిచ్చినా కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే అవకాశముంది’’ అని కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ గెలవదని తేలిపోయిన తర్వాత ఉన్న కొద్దికాలం పదవులను ఎందుకు వదులుకోవాలన్న అభిప్రాయానికి రావడం వల్లే నేతలెవరూ రాజీనామాలకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ‘నిజానికి తెలంగాణ ఇచ్చేందుకే అధిష్టానం నిర్ణయం తీసుకుందన్న విషయం కేంద్ర మంత్రివర్గంలో సీమాంధ్ర నేతలకు భారీగా పదవులు కట్టబెట్టినప్పుడే స్పష్టమైంది. కానీ పార్టీ ముఖ్యులంతా తమ పదవులకే ప్రాధాన్యమిచ్చి, తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది’ అని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు.

 

 బాబు లేఖే కొంప ముంచింది!

తెలంగాణకు టీడీపీ అనుకూలమంటూ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి ముందే కేంద్రానికి బాబు లేఖ రాయడం తెలిసిందే. పైగా ఈ విషయంలో ఆలస్యం చేయొద్దని కోరుతూ ప్రధానికీ లేఖ పంపారు. అదే తమ కొంప ముంచిందని సీమాంధ్ర టీడీపీ నేతలంటున్నారు. వారితో పాటు ప్రజల్లో కూడా బాబు తీరు పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విభజన నిర్ణయం గురించి బాబుకు కాంగ్రెస్ పెద్దలు ముందే సమాచారమిచ్చారని సీమాంధ్ర టీడీపీ నేతలంటున్నారు. అప్పుడు దాన్ని అడ్డుకునే అవకాశముండి కూడా బాబు అందుకనుగుణంగా వ్యవహరించలేదంటూ వారు తప్పుబడుతున్నారు. ‘‘కాంగ్రెస్ ఆలోచన తెలిసినప్పుడు సీమాంధ్రలోని 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామాలు చేయిస్తే అధికార పార్టీ అంత ధైర్యంగా విభజన నిర్ణయం తీసుకునేదే కాదు. ప్రధాన ప్రతిపక్షమే ఎదురు తిరిగితే కచ్చితంగా వెనకడుగు వేసేదే. కానీ బాబు నిత్యం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తూ తెలంగాణకు ఓకే అన్నారు.

 

 అందుకే ఇప్పుడు మేమంతా ఇబ్బందుల్లో చిక్కుకున్నాం’’ అంటూ దుయ్యబడుతున్నారు. రాజీనామాల విషయంలో కాంగ్రెస్‌లోని సమైక్యవాదులు కూడా టీడీపీతో కలిసొచ్చేవారని, ప్రభుత్వంకూలి విభజనకు ఆస్కారమే ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇంత జరిగాక కూడా ఇటు బాబు, అటు కిరణ్ మాట్లాడుతున్న తీరు చూస్తే వారిద్దరూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారని స్పష్టమవుతోందంటున్నారు. ప్రతిపక్ష నేతగా కాం గ్రెస్ నిర్ణయాన్ని విమర్శించాల్సిన చంద్రబాబేమో దాన్ని స్వాగతించారు. కిరణే అధిష్టానం నిర్ణయాలను స్వాగతించబోననీ, అలాగని వ్యతిరేకించనని చెప్పడంతో ప్రజల ంతా విస్మయానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కాంగ్రెస్ అధిష్టానం గేమ్‌ప్లాన్‌లో భాగంగానే ఇలా వ్యవహరించారన్న అనుమానాలు ఇరు పార్టీల నేతల్లో బలపడుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top