ఆగిన ఆపరేషన్లు.. కదలని అంబులెన్స్లు
ప్రొద్దుటూరు క్రైం: ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని అన్ని రకాల వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం ఉద్యోగులను తొలగించినందుకు నిరసనగా వారం రోజుల నుంచి యూనియన్ల ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఆస్పత్రిలో 106 మంది వివిధ విభాగాలలో ఔట్సోర్సింగ్ కింద పని చేస్తున్నారు. దోభి, బార్బర్, స్ట్రెచర్బాయ్, ఫార్మసీ, ల్యాబ్, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు.
వీరిలో 42 మందిని మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పలు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆపరేషన్లు నిర్వహించాలంటే దోభి, బార్బర్ తప్పనిసరిగా అవసరం. అయితే వీరు సమ్మెలో ఉండటంతో ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడుతోంది. ఇక్కడున్న దోభి వారానికి సరిపడ గుడ్డలను ఆపరేషన్ థియేటర్లో సిద్ధంగా ఉంచుతాడు. అయితే మంగళవారానికే శుభ్రం చేసిన గుడ్డలు అయిపోయాయి.
దీంతో డాక్టర్లు ఆపరేషన్లను ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే లేబర్ వార్డులో కూడా దోభి లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లు లేకపోవడంతో అంబులెన్స్లు ఆగిపోయాయి. ఆస్పత్రి నుంచి అత్యవసర కేసులు బయటికి వెళ్లాలంటే ప్రైవేట్ అంబులెన్స్లు ఆశ్రయించాల్సి వస్తోంది. ఆపరేషన్ చేసిన వ్యక్తులతో పాటు గాయ పడి న వారికి క ట్టిన కట్టును ప్రతి రోజూ డ్రెస్సింగ్ చేయాల్సి ఉంది. అయితే సంబంధిత ఎంఎన్ఓలు లేక వారం రోజుల నుంచి రోగులు డ్రైస్సింగ్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో టోకెన్లు రాసే వారు లేక పోవడంతో సిబ్బందే రాయాల్సి వస్తోంది. ఫార్మసీ విభాగం నుంచి నర్సులే మందులను తీసుకొని వెళ్తున్నారు. ఇలా అన్ని విభాగాలలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది.
మోకాళ్లపై నిల్చుని నిరసన
పులివెందుల అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది 7వ రోజు బుధవారం మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే 26మంది మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపి తమ సమస్యలు తీర్చేవరకు పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నవజగన్, శ్రీనివాసరెడ్డి, విజయ్కుమార్, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.