సీట్లు.. పాట్లు


కర్నూలు(జిల్లా పరిషత్): ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే రాష్ట్రం దాటాల్సిందే. 13 జిల్లాల కొత్త రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోనూ ఎంఎస్సీ నర్సింగ్ సీట్లు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కళాశాలలో సీట్లు మంజూరు కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల్లో వేలాది రూపాయలు వెచ్చించి చదవాల్సి వస్తోంది. బీఎస్సీ నర్సింగ్ సీట్ల పెంపును ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది.

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో వైజాగ్, కర్నూలులో మాత్రమే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనంతపురం, కడప, శ్రీకాకుళం, గుంటూరు, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. మొత్తం అన్ని కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు లేకపోవడం గమనార్హం. ఈ కోర్సు పూర్తి చేయాలంటే విద్యార్థినులు హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కర్నూలులో 1982లో 25సీట్లతో కళాశాలను ప్రారంభించారు. అప్ప ట్లో సొంత భవనం లేకపోవడంతో కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఓ నాలుగు గదుల్లో కళాశాలను కొనసాగించారు.

 

 ఇలా దాదాపు 29 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలోనే నర్సింగ్ కళాశాల నిర్వహించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయడంతో 2011లో నిర్మా ణం పూర్తయింది. ఆ సంవత్సరం ఆగస్టులో కొత్తభవనంలోకి కళాశాలను మార్పు చేశారు. అయితే సీట్ల పెంపు మాత్రం మరిచారు. కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీట్లను 25 నుంచి 60కి పెంచాలని, 30 సీట్లతో ఎంఎస్సీ కోర్సు ను ప్రారంభించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.

 

 నర్సింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత

 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్ పోస్టు, ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్, 10 లెక్చరర్, 10 పీహెచ్‌ఎన్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆరు అసిస్టెంట్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా రెండు పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. 10 లెక్చరర్ పోస్టుల్లో ఇద్దరు డిప్యూటేషన్‌పై వెళ్లగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. పది పీహెచ్‌ఎన్ పోస్టుల్లో 8 పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. మొత్తం 26 టీచింగ్ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధనలో నాణ్యత కొరవడింది. విద్యార్థినులు ప్రాక్టికల్స్ చేయాలన్నా, థియరీ వినాలన్నా ఇబ్బందిగా మారింది.

 

 హాస్టల్ భవనం లేక ఇబ్బందులు

 నర్సింగ్ కళాశాలకు సొంత భవనం ఉన్నా అందులో చదివే విద్యార్థినులకు హాస్టల్ వసతి కరువైంది. నాలుగేళ్లకు గాను మొత్తం 100 మంది విద్యార్థినులు ఇక్కడ అభ్యస్తుం డగా 25 మంది డే స్కాలర్, 75 మంది హాస్టల్‌లో ఉంటున్నారు. గతంలో కలెక్టరేట్ పక్కనున్న నర్సింగ్ క్వార్టర్స్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినిలు వసతి పొందేవారు. నర్సింగ్ స్కూల్‌ను అక్కడికి మార్చడంతో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులకు ఇబ్బందిగా మారిం ది. ప్రస్తుతం సొంత భవనంలోనే పైఅంతస్తు లో విద్యార్థినులకు వసతి కల్పిస్తున్నారు. అక్కడా చాలీచాలని వసతులతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 సమస్యలు పట్టని ప్రజాప్రతినిదులు

 బీఎస్సీ నర్సింగ్ కళాశాల అభివృద్ధి పట్ల పాలకులు శీతకన్ను వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నివాసముంటున్న నగరంలోని కళాశాలకే ఈ దుస్థితి ఉండటం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పడిన ఈ కళాశాలలో సీట్లను పెంచేందుకు, ఎంఎస్సీ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని అధ్యాపకులు, విద్యార్థినులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top