రేపటినుంచి సంకల్ప దీక్షలు: జేపీ
హైదరాబాద్: రేపటినుంచి తెలుగు భవిత సంకల్ప దీక్షలు ప్రారంభంకానున్నట్టు లోక్సత్తా అధ్యక్షుడు జే ప్రకాష్నారాయణ్ తెలిపారు. మార్చి 5న విశాఖలోనూ, మార్చి 8న విజయవాడలోనూ సంకల్ప దీక్షలు ప్రారంభంకానున్నట్టు ఆయన చెప్పారు. అలాగే మార్చి15న విజయవాడలో తెలుగు భవిత సంకల్ప రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు జేపీ తెలిపారు.
మార్చి 16న రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భవిత సంకల్ప విద్యార్థుల మానవహారాన్ని నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ లోటుపై వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరాన్ని వెంటనే పూర్తి చేయాలని, పరిశ్రమలకు పన్ను రాయితీ కల్పించాల్సిందిగా కోరారు. అంతేకాక వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేపీ డిమాండ్ చేశారు.