నిన్నటి నుంచి సెల్టవర్ పైనే ఉన్న సంజీవరావు!

నిన్నటి నుంచి సెల్టవర్ పైనే ఉన్న సంజీవరావు! - Sakshi


గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కిన వ్యక్తి ఈ సాయంత్రం వరకు కిందకు దిగలేదు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న  సెల్‌టవర్‌పైకి ఎక్కాడు.  పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రితోపాటు ఈ రోజు  ఉదయం నుంచి   ప్రయత్నించినా  ఫలితంలేదు.



 నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. ఒకవేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు వలలతో పోలీసులు సిద్ధంగా ఉన్నారు.



మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపునేని రాజకుమారి ఈరోజు సంజీవరావుతో ఫోన్లో మాట్లాడారు. ఎవరు ఏమి చెప్పినా అతను వినడంలేదు. అతను పట్టినపట్టు వీడటంలేదు. అర్బన్ ఎస్పీ త్రిపాఠి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top