సంఘాల మాటునా దొంగలే

సంఘాల మాటునా దొంగలే - Sakshi


 సాక్షి, కాకినాడ :రేణువంత ఇసుక చుట్టూ మేరువంత మాయ, మాఫియా అల్లుకుపోయాయన్నది ఏటా ఈ జిల్లాలో రుజువవుతున్న యథార్థమే. తత్ఫలితంగా వినియోగదారులకు ‘ఇసుకే బంగారమంత’ ప్రియమైపోతోందన్నదీ అంతకన్నా పచ్చి నిజమే. ఇసుకాసురుల ఇష్టారాజ్యానికి అరికట్టడానికి సర్కార్లు చిత్తశుద్ధితోనో లేక మొక్కుబడిగానో ఏ విధానాన్ని అవంబించినా; కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కొరడా ఝుళిపించినా ఏ మాత్రం అడ్డుకట్ట పడడం లేదన్నది మరింత కఠిన సత్యం. ఇసుక రీచ్‌లకు సంబంధించి వేలం పాటలైపోయాయి. లాటరీ విధానం అటకెక్కింది. ఇప్పుడు కొత్తగా డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు కట్టబెట్టాలని తెలుగుదేశం సర్కారు తీసుకున్న నిర్ణయమూ ఇసుకాసురుల పాలిట వరంగా పరిణమించనుంది. వేలంపాటలో అయితే సిండికేట్ అవతారమెత్తాలి.

 

 లాటరీ విధానంలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియదు. కానీ ఈ కొత్త విధానంలో అధికారులను మచ్చిక చేసుకుంటే చాలు.. కోరుకున్న సంఘాన్ని ఎంపిక చేసుకుని, ఆ సంఘం మాటున గోదావరి ఇసుకను దండుకోవచ్చు. ఆ ఇసుక నుంచి షరామామూలుగానే కోట్లు పిండుకోవచ్చు. దీంతో గతంలో ఇసుక మాఫియాలో చక్రం తిప్పిన వారు (ఇలాంటి వారిలో కొందరు గతం నుంచీ టీడీపీలో ఉన్న వారే కాగా, కొందరు తాజాగా పచ్చచొక్కాలు ధరించిన వారున్నారు) ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరితో చేయి కలిపి, రెండు చేతులా సంపాదించేందుకు పలువురు ‘దేశం’ ప్రజాప్రతినిధులు కూడా సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలు సూచించిన వారికే రీచ్‌లు దక్కనుండడంలో విశేషమేముంటుంది?

 

 తొలిసారిగా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ..

 ఇప్పటి వరకు జిల్లాస్థాయి ఇసుక కమిటీకి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించేవారు. తొలిసారిగా కలెక్టర్‌కు ఈ కమిటీ బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పడే జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఎంపిక చేసిన రీచ్‌లను కేటాయించే బాధ్యతను గనులశాఖకు అప్పగిస్తారు. వారు ఆయా రీచ్‌లను ఎంపిక చేసిన మహిళా సంఘాలకు జిల్లాస్థాయి కమిటీ అనుమతితో అప్పగిస్తారు. ఇందుకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చడం, యంత్రాల కొనుగోలు, ఇసుక రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్, భద్రత తదితర అంశాల్లో మహిళా సంఘాలకు తగిన సహకారాన్ని అందించే బాధ్యతను కలెక్టర్, ఎస్పీలకు అప్పగించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తమ పరిధిలోని సంఘాలకు ఈ మేరకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇసుక విక్రయించడానికి వీలుగా మినరల్ డీలర్ లెసైన్స్‌ను మహిళా సమాఖ్యలకు ఇప్పించడానికి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సహకరిస్తుంది.

 

 చక్రం తిప్పుతున్న

 ‘సైకిల్’ పార్టీ ప్రజాప్రతినిధులు

 జిల్లాలో 27 ఇసుక రీచ్‌లుండగా అన్నింటికీ గనుల శాఖ అనుమతులు వచ్చాయి. ఆ అనుమతులు వచ్చిన వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)పరిధిలో ఉన్న స్టేట్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ అథారిటీ నుంచి పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. అన్ని అనుమతులతో ఇప్పటికే కేటాయించేందుకు సిద్ధంగా ఇసుకరీచ్‌లను డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకొని చేజిక్కించుకోవాలని ఇసుకాసురులు అన్ని దారుల్నీ అనుసరిస్తున్నారు.

 

 రీచ్‌లున్న ప్రాంతాల్లో మహిళా సమాఖ్యలకు ఆర్థికపరమైన వనరులు సమకూర్చేందుకు, యంత్రసహకారాన్ని అందించేందుకు ముందుకొస్తునారు. అయితే తొలుత ఏ రీచ్‌ను ఎవరు దక్కించుకోవాలన్న దానిపై గతంలో మాదిరిగానే అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని, సిండికేట్‌గా ఏర్పడ్డాకే సంఘాల మాటున రీచ్‌లను దక్కించుకోవాలని చూస్తున్నారు. తొలుత కేటాయించే అవకాశాలున్న కడియం, వేమగిరి, వంగలపూడి, సీతానగరం, కోరుమిల్లి రీచ్‌లను చేజిక్కించుకోవాలని ఆయా ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చక్రం తిప్పుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఏర్పాటు కానుందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీ ఏర్పాటు అనంతరం రీచ్‌ల కేటాయింపుపై కసరత్తు మొదలు కానుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top