ఏపీలో జీతాలపై నేడు నిర్ణయం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ(బుధవారం)న జీతాలు ఇచ్చేది లేనిదీ మంగళవారం తేలనుంది. కేంద్రం ఇచ్చే అదనపు నిధులపైనే ఉద్యోగుల జీతాల అంశం ఆధారపడి ఉంది.  కేంద్రప్రభుత్వం నుంచి రెగ్యులర్‌గా రావాల్సిన నిధుల్లో రూ.1,065 కోట్లు సోమవారం రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇందులో 13వ ఆర్థిక సంఘానికి చెందిన నిధులు రూ.516 కోట్లు, జాతీయ చిన్న మొత్తాల కింద రూ.549 కోట్లు ఉన్నాయి.  చేబదులు, ప్రత్యేక చేబదులు రూ.1,150 కోట్లు దాటిపోయి ఓవర్ డ్రాఫ్ట్ రూ.5 వేల కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ రూపంలో నిధులొచ్చినా తొలుత ఓవర్ డ్రాఫ్ట్ తీర్చడానికి ప్రాధాన్యమివ్వాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.ఓవర్‌డ్రాప్ట్‌కు వెళ్లిన సొమ్మును పది దినాల్లో తిరిగి చెల్లించకపోతే ఆర్‌బీఐ రాష్ట్రప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ స్తంభింపచేస్తుంది.


 


ఒక రకంగా డిఫాల్టర్‌గా  పేర్కొం టుంది. ఈ పరిస్థితి వస్తే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ట మరింత మంటగలుస్తుందని, సింగపూర్ కాదు కదా జపాన్.. చివరకు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా అప్పు పుట్టని పరిస్థితి నెలకొం టుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తొలుత ఓవర్‌డ్రాఫ్ట్ నుంచి బయటపడేందుకు ప్రాధాన్యమిస్తామని, ఆ తరువాత ఉద్యోగుల జీతాల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆ వర్గాలు చెప్పాయి. మంగళవారంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున కేంద్రం నుంచి అదనపు నిధులు ఎన్ని వస్తాయో తేలిపోతుందని, అప్పుడు వేతనాల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల జీతాలకు, పదవీ విరమణ చేసినవారి పెన్షన్ చెల్లింపులకు నెలకు రూ.2,500 కోట్లు అవుతుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top