241 ఎకరాల్లో శాఖమూరు పార్కు


4 జోన్లుగా విభజన.. సంక్రాంతికి పూర్తి: మంత్రి నారాయణ వెల్లడి

 


సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో అన్ని హంగులతో అత్యాధునికంగా 241 ఎకరాల్లో నాలుగు జోన్లుగా శాఖమూరు పార్కును రూపొందించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌ మెట్‌ సంస్థ శాఖమూరు పార్కు డిజైన్‌ను రూపొందించి ఇచ్చినట్లు తెలిపారు. మొదటి జోన్‌ 85 ఎకరాలు, రెండో జోన్‌ 34, మూడో జోన్‌ 49, నాలుగో జోన్‌ అంబేడ్కర్‌ పార్కుతో కలిపి 73 ఎకరాలు ఉంటుందని వివరించారు.



మొదటి జోన్‌లో 46 ఎకరాలలో ఏర్పాటు చేసే అమ్యూజ్‌మెంట్‌ పార్కులో వాటర్‌ వరల్డ్‌తోపాటు క్రాఫ్ట్‌ బజార్‌ ఉంటాయని తెలిపారు. రెండో జోన్‌ను పూర్తిగా చిన్నారులకు కేటాయించారని, సాహస క్రీడలు, చిల్డ్రన్‌ అడ్వెంచర్, అవుట్‌ డోర్‌ జిమ్‌ ఉంటాయన్నారు. మూడో జోన్‌లో ఫ్లవర్‌ గార్డెన్,  డక్‌ పాండ్‌ ఉంటుందని తెలిపారు. నాలుగో జోన్‌లో కల్చరల్‌ మ్యూజియం, అంబేడ్కర్‌ పార్కు, ఇండోర్‌ అథ్లెటిక్‌ సెంటర్, స్పోర్ట్స్‌ క్లబ్, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీఎం సూచన మేరకు ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్‌’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top