తూనికలు, కొలతల శాఖ దాడులు

తూనికలు, కొలతల శాఖ దాడులు - Sakshi


- ఒంగోలు బాస్టాండ్‌లోని ఆరుషాపులపై కేసులు నమోదు

- ఆర్టీసీ ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామన్న ఒంగోలు ఇన్‌స్పెక్టర్  రామకృష్ణ

ఒంగోలు:
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్న పలువురు వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముందుగా వినియోగదారుల మాదిరిగా పలు షాపుల్లో శీతల పానీయాలు కొనుగోలుచేసేందుకు వెళ్లారు. అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి వెంటనే వారిపై కేసులు నమోదు చేశారు. షాపు నెంబర్లు 5,11,13,22,41 లతో పాటు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోనే ఉన్న నియోస్ ఫుడ్ కోర్టుపై కూడా కేసులు నమోదుచేసినట్లు తూనికలు కొలతల శాఖ ఒంగోలు ఇన్ స్పెక్టర్ కేవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. షాపు నెంబర్ 11లో అయితే శీతలపానీయాల అన్ని బాటిల్స్‌పై ఎంఆర్‌పీ ధరలు కనపడకుండా చేశారని తెలిపారు. వినియోగదారులు ప్రశ్నించకుండా ఉండేందుకు చేసిన మోసపూరితమైన చర్యగా భావిస్తున్నామన్నారు. వీరందరిపై ఆర్టీసీ ఉన్నతాధికారులకు కూడా రిపోర్టు పంపనున్నామన్నారు. ఒక్కో బాటిల్‌కు రూ. 5 నుంచి 15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రుజువైందన్నారు. సాంకేతిక నిపుణులు ఆలీబేగ్, అనీల్, సిబ్బంది సుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top