యథేచ్ఛగా రోజ్‌వుడ్ అక్రమ రవాణా


దట్టమైన అడవిగా పేరున్న మర్రిపాకల రేంజ్ నుంచి రోజ్‌వుడ్ ఖాళీ అవుతోంది. ప్రతి శనివారం మంప అల్లూరి స్మారక మందిరం వద్ద రోజ్‌వుడ్ ముక్కల వ్యాపారం జరుగుతోంది. తూర్పుగోదావరి, విశాఖ  సరిహద్దుల ద్వారా కొనుగోలు చేసిన ఉడ్ మొత్తం  తరలిపోతుంది. కాకరపాడు చెక్‌పోస్టు అక్రమ రవాణాకు అడ్డగా మారింది.ఇదంతా అటవీ అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

* మంపలో రోజ్‌వుడ్ వ్యాపారం

* వారానికి రూ.3 లక్షలలావాదేవీలు

* వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల

* పట్టించుకోని అధికారులు


కొయ్యూరు:రోజ్‌వుడ్(ఇరుగుడుసేవ)కు మైదా న ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది.దీని తరువాతనే టేకుకు ప్రాధాన్యమిస్తారు.ప్రతి శనివారం మంపలోని అల్లూరి పార్క్ వద్దకు ఆదివాసీలు రోజ్‌వుడ్ ముక్కలు తీసుకు వస్తారు. వాటిని కొనుగోలు చేసేందుకు రాజవమ్మంగి, కొయ్యూరు, రాజేంద్రపాలెం, పాతూరు, కేడీపేట, నర్సీపట్నం ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖలోని మారుమూల ప్రాంతాలకు చెందిన సుమారు 20 గ్రామాలకు చెందిన గిరిజనులు ప్రతి శనివారం రోజ్‌వుడ్‌ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రతివారం ఇక్కడ రూ.3 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి రాజేంద్రపాలెం, మంప, రేవళ్లలో నిల్వ చేస్తా రు. కొంతకాలం తరువాత వాటిని ఐసర్ లేదా జీపులు, టాటా మేజిక్‌లలో తరలిస్తున్నారు.

 

వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల: రోజ్‌వుడ్ ముక్కలను వస్తువులుగా చేసేందుకు వీలుగా మెషీన్లు ఏర్పాటు చేసుకున్న వారికి అనుమతి ఇస్తున్నారు. దీనికి సంబంధించి వడ్రంగులు,అధికారుల మధ్య ఒప్పందాలున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంపలో కొనుగోలు చేసిన వాటిని రేవళ్ల తీసుకువచ్చి అక్కడ వస్తువులుగా తయారు చేసి మైదాన  ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అనుమతి లేని వీటిపై దాడులు చేసి పట్టుకోవాల్సిన అట వీశాఖ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

 

అడవిలో రోజ్‌వుడ్ ఖాళీ!: వారానికి 250 వరకూ రోజ్‌ఉడ్ ముక్కలు రావడంతో అడవి  ఖాళీఅవుతోంది.అటవీ అధికారులు అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా రోజ్‌వుడ్‌చెట్లను పరిరక్షించవచ్చు.  ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అదుపులోకి తీసుకున్నా లేకుంటే వారు కొనుగోలు చేసిన ఉడ్‌ను పట్టుకున్నా రావడం మానేస్తారు.

* ఎప్పుడో ఒకసారి దాడులు: దాడులు చేయకుంటే ఉన్నతాధికారులకు అనుమానం వస్తుందని ఇక్కడ అధికారులు ఎప్పుడో ఒకసారి దాడులు చేస్తారు. పట్టుకున్న రోజ్‌వుడ్‌ను కూడా పూర్తిగా కలప డిపోకు చేరుస్తారన్న నమ్మకం లేదు.

* అక్రమ రవాణాపై దాడులు చేస్తాం: నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్‌ను వివరణ కోరగా, అక్రమ రవాణాపై దాడులు చేస్తామని చెప్పారు. కలప రవాణా అయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిబ్బందికి వెంటనే ఆదేశాలు ఇస్తామని  తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top