'పిచ్చోడి చేతిలో రాయిలా పాలన'
సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకొచ్చిన చంద్రబాబు నాయుడి పాలన పిచ్చివాడి చేతిలో రాయిలా ఉందని నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రోజా విమర్శించారు. చంద్రబాబు రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసి, ఇప్పుడు కొంగలా జపం చేస్తున్నట్లు యోగ చేస్తున్నారన్నారు. తణుకులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు లేవంటూనే తన బృందం తో కలిసి ప్రత్యేక విమానాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
సింగపూర్, జపాన్, మలేషియా అంటూ రాజధాని పేరుతో తిరుగుతూ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని, సమస్యలను పక్కన పెట్టి, రాజధాని పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. సుజనా చౌదరి, నారాయణ లాంటి కొంతమందికి లబ్ధి చేకూరేలా రాజధాని నిర్మిస్తున్నారే తప్ప సామాన్య ప్రజల కోసం కాదని రోజా అన్నారు. రాజధాని కట్టి చరిత్రలో నిలవాలనుకుంటున్నాడు.. కానీ రాష్ట్ర విభజనలో సహకరించి, రుణమాఫీ అంటూ ప్రజలని మభ్య పెట్టి ఎప్పుడో చరిత్ర హీనుడయ్యరన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రైతులను చంద్రబాబు దగా చేశారని అన్నారు.