ఎదురింటికి తాళాలు వేసి మరీ దోచుకు పోయారు
విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం రాయన్నపాడు కల్పతరువు కాలనీలో దోపిడి దొంగలు గత అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. కాలనీలోని ఓ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి కుటుంబ సభ్యులను బంధించి నగలు, నగదు డిమాండ్ చేశారు. అవి ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో వారి కాళ్లు చేతులు కట్టేసి... వారిపై దాడి చేశారు. దీంతో ఇంట్లో నగలు, నగదు ఎక్కడ ఉన్నది ఆ కుటుంబ సభ్యులు దొంగలకు వివరించారు. దొంగలు ఆ నగదు, నగదు తీసుకుని అక్కడి నుంచి పరారైయ్యారు.
దొంగలు అంతకుముందు కాలనీలోని వాసులు బయటకు రాకుండా పక్కా ప్రణాళికలతో పలు ఇళ్లకు తాళాలు వేశారు. అయితే ఈ రోజు ఉదయం పని మనిషి ఇంట్లోకి రావడంతో కుటుంబ సభ్యులంతా బంధించి ఉండటంతో స్థానికులకు సమాచారం అందించింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... తీవ్రంగా గాయపడని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.