‘రెవెన్యూ’లో కుదుపు

‘రెవెన్యూ’లో కుదుపు


సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో కుదుపు మొదలైంది. ఇన్నాళ్లు వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న వీరి బదిలీలకు ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి లోగా వీరి బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ గురువారం రాత్రి  ఆదేశాలు జారీ చేశారు. జీవోఎంఎస్-98 పేరి ట జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్ర కారం బదిలీ ప్రక్రియ పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో చేయాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగుల సాధారణ బదిలీలు నా లుగు నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హయాం లో పనిచేసిన రాష్ర్ట స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు ప్రతీ ఒక్కరికి స్థానచలనం కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో జారీ చేసిన జీవో-57 వివాదస్పదం కావడం.. ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో చేయాలన్న ఈ బదిలీల ప్రక్రియపై హైకోర్టు స్టే ఇవ్వడంతో బదిలీలకు ఆదిలోనే బ్రేకు లు పడ్డాయి.



దీంతో ఇన్‌చార్జి మంత్రితో సంబంధం లేకుండా శాఖాధిపతుల పర్యవేక్షణలోనే బదిలీలు చేయొచ్చంటూ మలి ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ఆగస్టు-1 నుంచి 15వ తేదీ బదిలీలకు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. శాఖల వారీగా ైగైడ్‌లైన్స్ కూడా జారీ చేసింది. కానీ రెవెన్యూ శాఖను మాత్రం ఈ బదిలీల నుంచి మినహాయించింది. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం, క్షేత్ర స్థాయిలో సర్వే, గ్రామస్థాయిలో గ్రామసభల నిర్వహణ వంటి బాధ్యతలు రెవెన్యూ అధికారులపై ఉండడంతో వీరిని గత నెల బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. ఆగస్టు 31తో మీ ఇంటికి మీ భూమికి గ్రామసభలు పూర్తి కావడంతో ఇక ఈ శాఖలో కూడా బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



సెప్టెంబర్-15వ తేదీ అర్ధరాత్రిలోగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తొలుత జారీచేసిన జీవో-57 ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులు, సిబ్బంది వారీగా అర్హుల జాబితాలను జూన్ లోనే సిద్ధంచేశారు. ఈ విధంగా జిల్లా రెవెన్యూ శాఖలో 1445 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 659 మంది బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పాతుకు పోయిన వీఆర్వోలకు స్థానచలనం కల్పించేందుకు జూలైలోనే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 470 మంది ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.



వీరికి పోస్టింగ్‌లు ఇవ్వడమే తరువాయి.. ఈసమయంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఉత్తర్వులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. ప్రస్తుతం వీరందరికి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. మరో పక్క పరిపాలనా సౌలభ్యం పేరిట ఇటీవలే పదిమంది తహశీల్దార్లకు కలెక్టర్ స్థానచలనం కల్పించారు. తాజా బదిలీల్లో  సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, సెక్షన్ సూపరింటెండెంట్‌లు, డిప్యూటీ తహశీల్దార్లతో సహా 189 మందికి స్థానచలనం కల్పించే అవకాశాలున్నాయి. రాష్ర్ట స్థాయి గురుపూజోత్సవం, నేషనల్ అథ్లెటిక్స్ మీట్ పూర్తయిన తర్వాత ఈ బదిలీలపై జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top