వసూళ్ల ‘ఎక్సైజ్’ రాజాలు!

వసూళ్ల ‘ఎక్సైజ్’ రాజాలు! - Sakshi


మద్యం దుకాణాలపై దందా

కొత్తగా వచ్చిన అధికారుల వేధింపులు

నెలసరి మామూళ్ల కోసం ఒతిళ్లు

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు


 

 అత్యంత అవినీతిమయమైన శాఖల్లో ఎక్సైజ్- 4వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న అధికారుల్లో కొందరు మాత్రం మొదటి స్థానంలో ఉండటానికి     పెద్ద పెద్ద ఎక్సైజ్‌లే చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన సీఐల బదిలీల్లో పలు ప్రధాన స్టేషన్లకు వచ్చిన కొత్త అధికారులు కేసులకంటే నెలసరి మామూళ్లపైనే దృష్టి సారించారు. అంతా తెలిసినా ‘ నా వాటా     ఎంత చెప్పు..?’ అంటూ ఉన్నతాధికారులు లెక్కలు     సరి చేసుకుంటున్నారు.

 

చిత్తూరు (అర్బన్): జిల్లా ఎక్సైజ్ శాఖలో దీర్ఘకాలంగా ఒకే స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలకు బదిలీలు చేస్తూ గత నెల 21న ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న కొందరు సీఐలను పక్క మండలాలకు, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఇతర  జిల్లాల్లో ఉన్న సీఐలను మన జిల్లాకు కూడా బదిలీ చేశారు. ఇలా మొత్తం 34 మంది సీఐలు బదిలీ అయ్యారు. అయితే కొత్త స్టేషన్లకు వెళ్లిన సీఐలు తమ విధులను పక్కనపెట్టి, జేబులు నింపుకోవడంపైనే దృష్టి పెట్టారు. సర్కిళ్ల నుంచి డిస్టిలరీలు, చెక్‌పోస్టులు.. ఇలా ప్రతీ చోటా వసూళ్ల దుకాణాలు తెరిచారు. సర్కిళ్లల్లో పనిచేస్తున్న సీఐలు ఆ పరిధిలో ఉన్న లెసైన్స్ కలిగిన మద్యం దుకాణాల యజమానులను పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. ప్రాధాన్యత, మద్యం దుకాణాల్లో జరిగే వ్యాపారం ఆధారంగా ఒక్కో దుకాణ యజమాని నుంచి ఒక్కో మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ మామూళ్లు నెలకు కనిష్టంగా రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.80 వేల వరకు ఉంటోంది. తిరుపతిలో అయితే కొన్ని దుకాణాల కొత్త సీఐలు నెలకు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.



ఇదేమిటని అడిగితే ప్రాధాన్యత ఉన్న పోస్టు కోసం పైస్థాయిలో రూ.లక్షలు ముట్టచెప్పి వచ్చామని, ఆ మాత్రం ఇచ్చుకోకపోతే ఎలా? అంటూ కొందరు సమర్థించుకుంటున్నారు. గతంలో కూడా ఇదే తరహా వ్యవహారం జరగడంతో చిత్తూరులోని ఎక్సైజ్ సూపరింటెండెండ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయినా ఆశాఖలో అవినీతి కిక్కు దిగడం లేదు.

 ఎక్సైజ్‌శాఖలో ఈ దందాల వ్యవహారంపై ఉన్నతాధికారులు పెదవి విప్పడం లేదు. సీఐలు వసూలు చేసే నెలసరి మామూళ్లలో ఉన్నతాధికారులకు సైతం లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని ఎన్‌ఫోర్సుమెంట్‌లో పనిచేసి ఇటీవల సర్కిల్‌కు వెళ్లిన పేరు వెల్లడికి ఇష్టపడని ఓ సీఐ చెప్పారు.

 

ఏమయ్యా.. నేను చార్జ్ తీసుకుని 15 రోజులవుతోంది. ఇప్పటి వరకు కనిపించలేదు. కనీసం పలకరించాలని కూడా తెలియదా..? ఏం వ్యాపారం చేసుకోవాలని ఉందా, లేదా.? ఇంతకుముందు ఎలాగ ఉండేదో మా కానిస్టేబుళ్లు అంతా చెప్పారు. నేను చాలా స్ట్రిక్ట్. గతంలో జరిగింది వదిలేయ్. ఇప్పుడు నెలకు రూ.40 వేలు ఇవ్వాల్సిందే. లేకుంటే నీ ఇష్టం..

 - చిత్తూరు ఈఎస్ పరిధిలోని ఓ సీఐ

 

తప్పుడు మార్గాల్లో డిస్టిలరీ నిర్వాహకుల నుంచి విధుల్లోకి చేరిన 15 రోజుల్లోనే రూ.లక్ష వరకు వసూలు చేశారా సీఐ. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఇది తానొక్కడికే కాదని, ఉన్నతాధికారులకు సైతం ఇవ్వాలని చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top