ఎస్సై వైఖరిపై రెవెన్యూ ఉద్యోగుల సమ్మె
నాయుడుపేట: ఎస్సై తమపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ రెవెన్యూ ఉద్యోగులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసన చేపట్టారు. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు జిల్లాలోని వరద నష్టం వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. నాయుడుపేట డివిజన్ ఉద్యోగులు కొందరు మంగళవారం రాత్రి ఒక హోటల్లో భోజనం చేస్తుండగా అక్కడికి చేరుకున్న పట్టణ ఎస్సై నారాయణ హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి మించి హోటల్ ఎందుకు పనిచేస్తుందని అడిగారు.
అయితే, అక్కడున్న రెవెన్యూ ఉద్యోగులంతా తాము విధులకు వచ్చి భోజనాలు చేయటంతో ఆలస్యమైందని చెప్పారు. అయితే, ఎస్సై నిర్లక్ష్యంగా మాట్లాడటంతో పాటు హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులంతా బుధవారం ఉదయం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమపట్ల అమర్యాదకరంగా ఎస్సై వ్యవహరించారని, వరదనష్టం వివరాలను తాము సేకరించబోమని తేల్చిచెప్పారు. వారికి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సంఘీభావం తెలిపింది. విధులు బహిష్కరించనున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించారు.