బాధ్యతగా విధులు
ప్రొద్దుటూరు టౌన్:
బాధ్యతగా విధులు నిర్వర్తించాలని చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ రాజేంద్రపసాద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ కంపోస్టు యార్డులో బుధవారం జరిగిన రాయలసీమ జిల్లాల కమిషనర్ల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ గదుల బాడుగలు రాబట్టడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. నీటి పన్నులు రాబట్టడంలో ఆదోని మున్సిపాలిటీ 23 శాతంతో అతితక్కువగా ఉందన్నారు.
ఆదోని కమిషనర్ కుమారి మాట్లాడుతూ రెండు రోజులకోసారి నీళ్లు ఇస్తుండటంతో నీటి పన్ను కట్టడం లేదని తెలిపారు. అది సరైన సమాధానం కాదని రాజేంద్రపసాద్ అన్నారు. నగిరి మున్సిపాలిటీ 27.60 శాతం మాత్రమే నీటి పన్నులు వసూలు చేసిన విషయంపై ప్రశ్నించారు. మదనపల్లెలో 10 రోజులకోసారి నీళ్లు ఇస్తున్న విషయాన్ని కమిషనర్లు గ్రహించాలన్నారు. రాయలసీమ నీటి సమస్యలపై మున్సిపల్ కమిషనర్లు, అక్కడ ఉన్న చైర్మన్లతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి కోరారు.
రాయలసీమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. రోడ్లు వేశాక పైపులైన్లు వేయడంతో తిరిగి రోడ్లను పగులగొట్టాల్సి వస్తోందని, ఈ విధానాన్ని మార్చుకోవాలన్నారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో కర్నూలు కార్పొరేషన్కు ఇచ్చిన టార్గెట్లో 92 శాతం సరఫరా చేస్తోందన్నారు. అతి తక్కువగా పామిడి, గుత్తి మున్సిపాలిటీలు 33 శాతం సరఫరా చేస్తున్నాయన్నారు. కడప కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ టీఎల్ఎఫ్ల ద్వారా ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆర్డీకి వినతులు
జీతాలు పెంచాలని మెప్మా ఆర్పీలు ఆర్డీకి వినతి పత్రం ఇచ్చారు. చాలా కాలంగా కేవలం రూ.1200 జీతంతో మున్సిపాలిటీలో జరిగే అన్ని కార్యక్రమాల్లో తాము పాల్గొని పని చేస్తున్నామని ఆర్పీలు ఆర్డీకి విన్నవించారు. కనీసం నెలకు రూ.5వేలు జీతం ఇస్తే కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందన్నారు.
చాలా హీనంగా మాట్లాడుతున్నారు
మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు చాలా హీనంగా మాట్లాడుతున్నారని ఆర్డీకి కార్మిక నాయకుడు అన్వేష్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, విజయ్కుమార్ విన్నవించారు. 1వ డివిజన్ శానిటరీ ఇన్సెక్టర్ కృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 2వ డివిజన్లో చాలా ఏళ్లుగా మేస్త్రీగా పనిచేస్తున్న కాకిచంద్రను మరో డివిజన్కు బదిలీ చేయాలన్నారు.