ఇసుక రీచ్‌ల్లో అద్దె దుమారం!


 ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ అద్దె, బిల్లుల చెల్లింపు విషయంలో డీఆర్‌డీఎ అధికారులు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల మధ్య పోరు నడుస్తోంది.  మేక్ సొసైటీ పరిధిలో పనిచేసేందుకు పలుచోట్ల ట్రాక్టర్ల యజమానులు ఆసక్తి చూపడం లేదు. ఇసుక వరకే  మేక్ సొసైటీలు చూసుకోవాలని, రీచ్‌ల నుంచి  రవాణా చేసేందుకు ఎంత అద్దె వసూలు చేయాలన్న విషయం తమకే వదిలేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ప్రభుత్వ నిర్దేశించిన ధరకు   రవాణా చేస్తే  లాభాలెక్కువగా ఉండవనే ఆలోచనతో ఉన్నారు. ఇందులో భాగంగా  జిల్లాలో పలుచోట్ల  సహాయ నిరాకరణ చేస్తున్నారు. వీరిని కాదని ఎవరైనా ఇసుక రవాణా చేసేందుకు ముందుకు వచ్చినా అడ్డుకుంటున్నారు. ఫలితంగా  ఇసుక కోసం చలానా కట్టిన సుమారు 60 మందికి సకాలంలో  ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి   

 నెలకొంది. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయ నిరాకరణ వద్దని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని డీఆర్‌డీఎ అధికారులు హితబోధ చేసినా ట్రాక్టర్ల యజమానుల నుంచి స్పందన కనిపించడం లేదు. దీంతో వ్యవహారం ముదిరిపాకాన పడింది. ఈ గొడవ కలెక్టర్ వరకూ వెళ్లింది. మొండికేస్తున్నవారి   సంగతేంటో చూడాలని ఆర్టీఎ అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఇంకేముంది తనిఖీలు జరగనున్నాయి. దారికొస్తే వెసులుబాటు కల్పిస్తారు. లేదంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోనున్నారు.     


   రీచ్‌ల నుంచి ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఆ ట్రాక్టర్లు కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గుర్తింపు పొందిన ట్రాక్టర్లను మాత్రమే రీచ్‌లోకి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాల ద్వారా తరలిస్తే   చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు నిర్ధేశిత మేరకు అద్దె చెల్లిస్తారు. 5 కిలోమీటర్ల దూరానికి ఇసుక రవాణా చేస్తే   రూ.400, 5నుంచి10కిలోమీటర్ల లోపైతే రూ.600, 10కిలోమీటర్లు దాటితే రూ.600తో పాటు ప్రతీ కిలోమీటర్‌కు అదనంగా రూ. 34 చొప్పున   అద్దెకింద చెల్లిస్తారు. అయితే, ఈ రేట్లు ట్రాక్టర్ల యజమానులకు సంతృప్తికరంగా లేవు.  ఆ రేట్లు గిట్టుబాటు కావని వారు అధికారులకు తేల్చిచెప్పారు. అంతేకాకుండా రవాణా చేసిన లోడులకు అధికారులు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పలుచోట్ల   ట్రాక్టర్ల యజమానులు  ఇసుక రవాణా చేసేందుకు   ఆసక్తి చూపడం లేదు.     ఇసుక వరకే మేక్ సొసైటీలు చూసుకోవాలని, రవాణా అద్దె ఎంతన్నది తమకు వదిలేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లిమర్ల, గుర్ల మండలాల్లోని పలు రీచ్‌లలో ఇప్పటికే సహాయ నిరాకరణకు దిగారు. ఎంత వస్తే అంతే చాలని కొందరు యజమానులు ముందుకొస్తున్నా, సహాయ నిరాకరణ చేస్తున్న యజమానులు అడ్డుకుంటున్నారు. ఎవరూ రవాణా చేయకపోతే అధికారులే దిగొస్తారని, రవాణా వ్యవహారం మన చేతిలోకి వస్తుందని హితబోధ చేస్తున్నారు.  ఇదే పరిస్థితి జిల్లాలోని మరికొన్ని రీచ్‌ల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. రోజు రోజుకు ఈ సమస్య జఠిలమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్‌డీఏ అధికారులు రంగంలోకి దిగి... మొండికేయడం తగదని, అడ్డుకోవడం మంచిది కాదని, చెల్లింపుల డీడీలిస్తున్నా తీసుకోవడానికి మీరే ముందుకురావడం లేదని  సంబంధిత ట్రాక్టర్ల యజమానులతో సంప్రదింపులు చేస్తున్నారు. అయినా ఫలితం కనిపించడం లేదు. దీంతో విషయాన్ని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ దృష్టికి డీఆర్‌డీఏ అధికారులు తీసుకెళ్లారు.  ట్రాక్టర్ల యజమానుల తీరు సరికాదని, చెబితే వినేటట్టు లేరని భావించిన కలెక్టర్...వారి సంగతేంటో చూడాలని, నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవో చూడటమే కాకుండా రవాణా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని  ఆర్టీఓను ఆదేశించినట్టు తెలిసింది.  దీంతో వ్యవహారం ముదరపాకాన పడింది.     

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top