సమర్థతే గీటురాయి..!

సమర్థతే గీటురాయి..!


ఎచ్చెర్ల : వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు అనేది కీలకమైంది. రిజిస్ట్రార్లకు నితంతరం వత్తిళ్లు...పని భారం ఉంటుంది. ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి సమర్థత,నైపుణ్యం, సానుకూల ధృక్పథం, సమయానుకూల ఆలోచనా ధోరణి అవసరం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణ మోహన్, తనదైన శైలిలో పని చేస్తూ సమర్థతే గీటురాయిగా మందుకు సాగుతూ గుర్తింపు పొందారు. రిజిస్ట్రార్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగుపెట్టారు కృష్ణ మోహన్.నలుగురు వైస్ ఛాన్సలర్లు దగ్గర పనిచేసిన ఘనత వర్సిటీలో 2008 జూన్ 25న ఏర్పడ గా, ఇప్పటి వరకు ఇక్కడ నలుగురు వీసీలు పని చేశారు.

 

 ఇందులో ఇద్దరు ఇన్‌ఛార్జి వీసీలు, మరో ఇద్దరు రెగ్యులర్ వీసీలు. రిజిస్ట్రార్‌ను ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ అభివృద్ధి మండలి అనుమతితో వైస్ ఛాన్సలర్ నియమిస్తారు.వర్సిటీ ఏర్పడ్డాక మొదటి రిజస్ట్రార్‌గా మొదటి వీసీ ఎస్వీ సుధాకర్ ఏయూ సీనియర్ జువాలజీ ప్రొఫెసర్ జి.జ్ఞానమణిని 2008 ఆగస్టు 25న నియమించారు. 2009 ఆగస్టు 25కి ఏడాది ముగిసిన తరువాత మరో సారి ఆయనను కొనసాగించకపోవడంతో రిలీవ్ అయ్యారు.అనంతరం అప్పటి ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్యకు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా అవకాశం ఇచ్చారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈయన ఇన్‌ఛార్జిగా కొనసాగారు.అనంతరం 2 009 సెప్టెంబర్ 16న ఆంధ్రాయూనివర్సిటీలోని కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా అప్పటి వీసీ ఎస్వీ సుధాకర్ సిఫారసుతో ప్రభుత్వ నియమించింది. అప్పటి నుంచి ఈయన కొన సాగుతున్నారు.

 

 ఎస్వీ సుధాకర్ తరువాత ఇన్‌ఛార్జి వీసీలు వై.సత్యనారాయణ, ఆర్జీబీ భగవత్ కుమార్ సైతం ఈయననే కొనసాగించారు.ఒక దశలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా వెళ్లిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుత వీసీ హెచ్.లజపతిరాయ్ కృష్ణమోహన్ సమర్థతను గుర్తించి ప్రోత్సహించడంతో ఐదేళ్లు రిజిస్ట్రార్‌గా పూర్తి చేసుకుని ఘనత వహించారు. అడ్డంకులను,రాజకీయ వత్తిళ్లను అధిగమించి కృష్ణమోహన్ రిజిస్ట్రార్‌గా మంచి పనితీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. 2011 సెప్టెంబర్ 16న పదవీకాలం మూడేళ్లు పూర్తి కావడంతో ఇక్కడి నుంచి రిజిస్ట్రార్‌ను సాగ నంపాలని, స్థానికులకు అవకాశం ఇవ్వాలని కొందరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.అయినా అప్పటి ఇన్‌ఛార్జి వీసీ వై.సత్యనారాయణ రిజస్ట్రార్‌గా కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ఉత్తర్వులతో కొనసాగించారు. 2012 ఆగస్టు 29న మాకుమ్మడిగా స్థానికులు రిజస్ట్రార్‌ను మార్పు చేయాలని అప్పటి ఇన్‌ఛార్జి వీసీ భగవత్ కుమార్‌కు వినతి పత్రం ఇచ్చినా ఇన్‌ఛార్జి హోదాలో మార్పు చేయనని స్పష్టం చేశారు.

 

 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు

 వర్సిటీ విభాగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తరుఫున 2011లో ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి కూడా కృష్ణమోహన్ కావటం గమనార్హం. 2012లో జి.తులసీరావు, 2013లో ఎం.చంద్రయ్య, 2014లో పి.చిరంజీవులు ఈ అవార్డులు స్వీకరించారు.

 

 ఆనందంగా ఉంది

 వర్సిటీ అభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. వర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఇప్పటికే ప్రభుత్వం కావల్సినంత స్థలం కేటాయించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.18 కోట్ల భవనాలు నిర్మాణం పూర్తయితే వసతి కొరత పూర్తిగా తీరిపోతుంది.కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. వన్ జీబీ ఇంటర్నెట్ వంటి సౌకర్యాం అందుబాటులోకి వచ్చింది. వర్సిటీలోని అన్ని విభాగాలను బలోపేతం చేయటమే లక్ష్యం.

 - ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్,రిజిస్ట్రార్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top