బెదిరింపులే బలి తీసుకున్నాయి..!
బొబ్బిలి: మండలంలోని గున్నతోటవలసకు చెందిన సువ్వాడ రామకృష్ణ (42) శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఐడీ పార్టీ పోలీసులే కారణమని లేఖ రాసి, తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గున్నతోటవలసకు చెందిన సువ్వాడ రామకృష్ణ గతంలో ట్రాక్టరు యజమాని. అప్పట్లో రోడ్డు ప్రమాదం జరగడంతో ట్రాక్టరును అమ్మేశాడు. అనంతరం గ్రోత్సెంటరులోని వర్కుషాపు వద్ద నైట్వాచ్మన్గా కుదిరాడు.
గతంలో రామకృష్ణ దగ్గర కూలి పనిచేసిన పిరిడి రమేష్ను దొంగతనం కేసులో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది బొబ్బిలిలో 12 తులాల బంగారం, ఐదు గ్యాస్ సిలిండర్లను చోరీ చేసినట్లు రమేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. వాటిని గతంలో యజమాని అయిన రామకృష్ణకు అమ్మినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఐడీ పార్టీ పోలీసులు శుక్రవారం సాయంత్రం రామకృష్ణను పోలీస్స్టేషనుకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం రాత్రి పదిన్నర గంటలకు వదిలారు.
అనంతరం రామకృష్ణ నైట్ డ్యూటీకి వెళ్లిపోయాడు. అప్పటికే మనస్థాపంతో బాధపడుతున్న అతనిని ఒంటరిగా వదలడం ఇష్టలేక.. భార్య, కుమారుడు ఇంటికి తీసుకొచ్చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచిన రామకృష్ణ.. ఇందిరమ్మ కాలనీకి వెళ్తానని ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఉదయం ఐదు గంటల సమయంలో బొబ్బిలి సమయంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రామకృష్ణకు భార్య గోపమ్మ, ఇద్దరు కుమారులున్నారు. రైల్వే పోలీసు హెచ్సీ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తన చావుకు ఐడీ పార్టీ వారే కారణమంటూ..
మృతుని వద్ద లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు గల కారణాలను రామకృష్ణ అందులో వివరించాడు. ‘కేసు విషయంలో ఐడీ పార్టీ పోలీసులిద్దరు చాలా బెదిరించారు. నిజం చెప్పకపోతే కాళ్లూ చేతులు ఉండవని హెచ్చరించారు. అందుకే భయపడి తప్పుడు పేర్లు రాశాను. ఆ పేర్లతో వారికి ఏ సంబంధమూ లేదు. నా చావుకు ఐడీ పార్టీకి చెందిన ఇద్దరే కారణం. ఎస్ఐ గారూ నేను ఏ తప్పూ చేయలేదు. నేనెలాంటి వాడినే ఆ ఊరిలో అడగండి’ అంటూ లేఖలో రాసి తనువు చాలించాడు.
కోపోద్రిక్తులైన గ్రామస్తులు
పోలీసులు వేధింపుల వల్లే రామకృష్ణ ప్రాణాలు తీసుకున్నాడని తెలియడంతో గున్నతోటవలస గ్రామస్తులంతా కోపోద్రిక్తులయ్యారు. స్థానిక పోలీస్స్టేషన్ను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా విషయం తెలుసుకున్న సీఐ రవి, ఎస్సై అమ్మినాయుడులు పరిస్థితిని చక్కదిద్దారు. డీఎస్పీ రమణమూర్తి పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తన భర్త మృతికి కారణమైన ఐడీ పార్టీ పోలీసులు శ్యామ్, వెంకటరావులపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య గోపమ్మ డీఎస్పీకి ఫిర్యాదు చేసింది.