కరుణించు ప్రభూ


రైల్వే బడ్జెట్.. ప్రతి ఏటా జిల్లా ప్రజలను ఊరించి తుస్ మనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆశలు రేకెత్తించి చివరకు నిరుత్సాహ పరుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ఈనెల 26వ తేదీన 2015-16 వార్షిక రైల్వే బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంగా జిల్లా ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సారైనా ‘ప్రభు’ కరుణిస్తారా అని కోటి కళ్లతో ఎదురు చేస్తూన్నారు.       

 

 రాష్ట్ర తొలి రాజధాని, రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాకు అన్నింటిలోనూ అన్యాయమే జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం, ప్రభుత్వం కరుణించకపోవడం, కేంద్ర అదుకోకపోవడం వంటి కారణాలు జిల్లాభివృద్ధికి శాపంగా మారాయి. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రతిసారి అన్యాయం జరుగుతోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ ఎంపీ రైల్వే మంత్రి పదవిని దక్కించుకున్నా నిరాశ మాత్రం తప్పడం లేదు. రైల్వే ప్రాజెక్టుల పురోగతికి పట్టిన గ్రహణం వీడడం లేదు. జిల్లాలో ఓ డివిజన్ లేదు. రైళ్ల రాకపోకలకు డబుల్ ట్రాక్ లేదు. కర్నూలు మీదుగా గరీబ్థ్‌ల్రు లేవు.

 

  పలు సూపర్ ఫాస్టులకు స్టాపింగ్‌లు లేవు. ప్రయాణికులకు మెరుగైన సేవలు పక్కనపెడితే కనీస సౌకర్యాలు లేవు. కర్నూలును ఒక డివిజన్‌లో, డోన్‌ను మరో డివిజన్‌లో ఉండడంతో పురోగతికి శాపంగా మారింది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పలుసార్లు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ప్రధాని నరేంద్ర మోదీలతోపాటు పలువురు పెద్దలను కలిసి జిల్లా రైల్వే పురోగతికి సహకరించాలని కోరినా ఫలితం లేకపోవడం గమనార్హం.

 

 జిల్లాలో ప్రధాన డిమాండ్లు.. అవసరమయ్యే నిధులు:

 మంత్రాలయం - కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త రైల్వే లైను పనులకు రాజకీయ గ్రహణం పట్టకుంది. జిల్లా కేంద్రంతో అధ్యాత్రిక కేంద్రానికి రైలు మార్గం నిర్మించాలని 45 ఏళ్ల క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ మోక్షం లభించ లేదు. రెండు సార్లు సర్వే చేసి, నిధులు వృథా చేశారు తప్ప మార్గం చూపలేదు. 2004లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించి, సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు. 2011 డిసెంబర్‌లో రీ సర్వే చేసి నివేదికలు సమర్పించినా పురోగతి లేదు.

 

 110 కిలో మీటర్లుకు పొడవైన ఈ మార్గం ఏర్పాటుకు రూ.1100 కోట్లకు అవసరమని అంచనా. ఇది పూర్తి చేస్తే కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు రవాణ వ్యవస్థ మెరుగుపడి పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈలైను ఏర్పాటు ప్రతిపాదనను 2015 బడ్జెట్‌లో చేర్చాలని జనవరి 6న విజయవాడలో జరిగిన ఎంపీల సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కోరారు. ఈనెల 10వ తేదీన జిల్లాకు వచ్చిన జీఎం ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవను కలిసి జిల్లా పరిస్థితులు వివరించిన విషయం తెలిసిందే.

 

 కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపు ఏర్పాటుకు 2013 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిని గత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. స్థల సేకరణకు పరిశీలనలు చేసి సేకరించినా పలు కారణాలతో ఇది రద్దైనట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గత బడ్జెట్‌లో దీనికి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పోరాట ఫలితంగా ప్రభుత్వం ఇటీవలే రూ.10కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును పూర్తికి మొత్తం రూ. రూ.250 కోట్లు అవసరం అని అంచనా.

 

 దూపాడు వద్ద ట్రైన్ మెయింటెన్స్ (నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని గతంలో మాజీ మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2 కోట్లు కావాల్సి ఉంది. దీంతోపాటు వర్క్‌షాపు పూర్తయితే దాదాపు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

 రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించనున్నారు. తొలి రాజధాని, జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. అయితే గుంటూరు వరకు కేవలం రెండు ప్యాసింజరు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. విజయవాడ వరకు కనీసం రెండు రోజువారి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సి ఉంది.

 

 గుంటూరు -డోన్- గుంతకల్లు మధ్య 478 కిలో మీటర్ల మేరకు డబుల్ లైను, విద్యుదీకరణకై సర్వే పనులు పూర్తయ్యాక రూ.535.93 కోట్లు కావాలని కోరినా నిధులు విదిల్చలేదు. డోన్ మీదుగా గుంటూరు వరకు సింగిల్ లైనులో రెండు మూడు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. డబుల్ లైను, విద్యుదీకరణ చాలా అవసరం.

 

 సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునీకరణ, మల్టీప్లెక్స్ భవన నిర్మాణం, రెండో ప్లాట్ ఫాంపై పూర్తి స్థాయి షెడ్ నిర్మాణానికి, ఆదోని స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లకు పైగా నిధులు కావాలి.

 

 గుంతకల్లు నుంచి డోన్, కర్నూలు మీదుగా సికింద్రాబాద్ వరకు 360 కిలోమీటర్లు దూరం డబుల్ లైన్, విద్యుదీకరణకు సర్వే చేసినా పెండింగ్‌లో ఉంది.తాత్కాలికంగా హాల్ట్ ఇచ్చిన కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను పూర్తి స్థాయి స్టాపింగ్ ఇచ్చి అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్టు రైళ్లను కర్నూలు రైల్వేస్టేషన్‌లో నిలపాలి.

 హోస్పెట్ - మంత్రాలయం - కర్నూలు -నంద్యాల- శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు మార్గం నిర్మించాలి.

 

 డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడుపుతామని కోట్ల ఇచ్చిన హామీ పెండింగ్‌లో ఉంది.దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండి కలగా మిగిలిన కడప జిల్లా ఎర్రగుంట్ల - బనగానపల్లె- నంద్యాల లైను పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ లైను 1997లో మంజూరయి పెండింగ్‌లో ఉన్న 20 కిలో మీటర్ల మేరకు (నంద్యాల క్రాస్‌లైన్ వెంకటేశ్వరపురం వరకు) పనులు పూర్తి చేసేందుకు, అసంపూర్తిగా ఉన్న బనగానపల్లె, కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ల పనుల పూర్తికి రూ.70 కోట్లు అవసరం అవుతాయి. మొత్తం రూ.150కోట్లు కేటాయిస్తే నంద్యాల ప్రాంతం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

 

 సికింద్రాబాదు నుంచి కర్నూలు మీదుగా బెంగుళూరు వరకు గరీబ్థ్ ్రఏర్పాటు ప్రవేశపెట్టాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది.విజయవాడ నుంచి నంద్యాల, ద్రోణాచలం, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలి.ఆదోని మీదుగా  ఔరంగాబాదు నుంచి రేణిగుంట, యశ్వంత్‌పూర్ నుంచి ఆదోని మీదుగా కాటా (ఉత్తరప్రదేశ్) వరకు నడుపుతామని హామీ ఇచ్చినా నెరవేరలేదు.

 

 కర్నూలు - నంద్యాల మధ్య వారంలో ఐదు రోజులు నడుస్తున్న డెమూ ప్యాసింజరు రైలును ప్రతి రోజూ నడపాలి.మద్దికెర - నంచర్ల మధ్య రూ.9 కోట్లతో నిర్మించతలపెట్టిన 5 కిలోమీటర్ల రైలు మార్గం పూర్తయితే హైదరాబాద్- కర్నూలు - డోన్ మీదుగా ముంబాయికి వెళ్లే ప్రయాణికులకు ప్రధాన అనుసంధానం (లింక్) ఉంది. దీంతో ముంబయి ప్రయాణం సులువు అవుంతుంది.కోసిగి - మంత్రాలయం మధ్య డబ్లింగ్ పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు.డోన్ పరిధిలోని లెవల్ క్రాసింగ్ నంబర్ 166, 150 గేట్ల వద్ద రూ.19.99 కోట్లతో చేట్టిన పనులు పూర్తి చేయాల్సి ఉంది..    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top