'మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి'
సాక్షి, అమరావతి : కృష్ణాజిల్లా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మూలపాడు బస్సు ప్రమాదంపై మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలన్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రఘవీరా సూచించారు. కృష్ణాజిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే.