కాంట్రాక్టర్ జేబులు నింపే కుట్ర
టీడీపీ సర్కారుపై పీసీసీ అధ్యక్షుడి ఆరోపణ
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కు నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్గా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు యత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఈ చెల్లింపులు సాధ్యం కాదని నీటిపారుదల, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు స్పష్టంగా ఫైళ్లలో పేర్కొన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం అధికారులపై ఒత్తిడి తెచ్చి నిధుల విడుదలకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
నిబంధనల్లోని క్లాజ్ 49.2 (2)ను సడలిస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఏకంగా మెమో నంబర్ 3498/ప్రాజెక్ట్స్ 1/ఎ2/2014 జారీ చేసిందని, దీన్నిబట్టి చూస్తే ఆగమేఘాల మీద అడ్వాన్సులు విడుదల చేయించేందుకు కుట్రచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రఘువీరా బుధవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మొబిలైజేషన్ అడ్వాన్సులను నిబంధనల ప్రకారం చెల్లిస్తే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవినీతి, అక్రమాలుగా చిత్రీకరించి యాగీ చేసిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిబంధనలు ఉల్లంఘించి పోలవరం కాంట్రాక్టర్ జేబులు నింపేందుకు ఎలా యత్నిస్తున్నారని నిలదీశారు.
ఆ అడ్వాన్సులను
జాయింట్ వెంచర్కు చెల్లించాలి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు, మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించేందుకు తాము వ్యతిరేకం కాదని.. వాటిని జాయింట్ వెంచర్ లేదా ప్రధాన భాగస్వామ్య సంస్థకు చెల్లించాలని రఘువీరా పేర్కొన్నారు. కాంట్రాక్టర్ కొనుగోలుచేసిన యంత్ర సామగ్రికి సంబంధించిన బిల్లుల ఇన్వాయిస్లు నీటిపారుదలశాఖకు అప్పగించడంతో పాటు యంత్రసామగ్రిని నీటిపారుదల శాఖకు తనఖా పెట్టాలని ప్రభుత్వం జారీచేసిన మెమోలో పేర్కొందని, అసలు ఈ విధంగా ప్రత్యేక మెమో ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తమ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని.. వాస్తవాలు తేల్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.