'ఇదొక దండగ ప్రాజెక్టు'


మడకశిర (అనంతపురం జిల్లా):ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారాలోకేష్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబునాయుడుని బిగ్‌బాస్‌గా, ఆయన కుమారుడు నారాలోకేష్‌ను స్మాల్‌బాస్‌గా అభివర్ణించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వారు రూ.400కోట్లను దండుకోనున్నారని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తన సొంతగ్రామమైన అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఇదొక దండగ ప్రాజెక్టు అని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ పట్టిసీమ ప్రాజెక్టు వృథాసీమ ప్రాజెక్టుగా మారనుందని విమర్శించారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరు సాగిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం పార్టీ డబ్బుసంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పని చేస్తున్నదని ఆరోపించారు. భవిష్యత్తులో ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.



మే 2న గుంటూరులో ఏపీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ




ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మే 2న గుంటూరులో ఏపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top