ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతా: కృష్ణయ్య
అమరావతి: బీజేపీ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పందించారు. ప్రస్తుతానికి తనకు బీజేపీలో చేరే ఆలోచనేదీ లేదని ఆయన అన్నారు. ప్రస్తుతానికి టీడీపీలోనే కొనసాగుతున్నట్లు తెలిపారు. తాను టీడీపీ మహానాడు సభలకు ఎన్నడూ వెళ్లలేదని, వెళ్లే అలవాటు కూడా లేదన్నారు. ప్రస్తుతం తాను బీసీ సమస్యలపై పోరాతున్నానని, బీసీల అజెండాతోనే పని చేస్తానన్నారు.
చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సీట్లు కేటాయించేలా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వంపై బీసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. బీసీ వ్యక్తి ప్రధానిగా ఉండటంతో బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడంపై అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపామన్నారు.