పండుగ లేదు..పబ్బం లేదు !
పులిచింతల’ ముంపు గ్రామాల్లో కనిపించని దీపావళి సందడి
గుంటూరు : పులిచింతల ముంపు గ్రామాలు దీపావళి వెలుగులకు దూరమయ్యాయి. ఆ పల్లెల్లో పండుగ వాతావరణమే కనిపించడం లేదు. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాల్లో ఎవరిని పలకరించినా కంటతడిపెడుతున్నారు. కష్టాలు ఏకరువు పెడుతున్నారు. ‘ పండుగా లేదు పబ్బం లేద’ని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.
► ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే వారికి మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టింది..
►మండలంలోని బోదనం, కోళ్లూరు, చిట్యాల, చిట్యాల తండా, గొల్లపేట తదితర గ్రామాల్లోకి ఇప్పుడు పులిచింతల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది. దీంతో ఊళ్లన్నీ ఖాళీ చేసి అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది..
► మరోవైపు గ్రామాల్లోకి వచ్చేస్తున్న నీరు ఇప్పటికే పంట పొలాలను ముంచెత్తు తోంది. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పైరు వరద నీటికి మునిగిపోతుంటే కన్నీళ్లే మిగిలాయంటున్నారు.
►ఇలాంటి పరిస్థితుల్లో ఇక పండుగలు ఎలా జరుపుకోవాలంటూ ఆ పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
►ఏ అధికారి కూడా తమవైపు రావడం లేదని, కనీసం తమ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని కంటతడిపెడుతున్నారు.
► ఏ ఇల్లు చూసినా బోసిపోయి కనిపిస్తోంది. పల్లె ప్రజల్లో ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి నష్టపరిహారం అందించడం ద్వారా పులిచింతల ముంపు గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.