పండుగ లేదు..పబ్బం లేదు !

పండుగ లేదు..పబ్బం లేదు !


పులిచింతల’ ముంపు గ్రామాల్లో కనిపించని దీపావళి సందడి

 

గుంటూరు : పులిచింతల ముంపు గ్రామాలు దీపావళి వెలుగులకు దూరమయ్యాయి. ఆ పల్లెల్లో పండుగ వాతావరణమే కనిపించడం లేదు. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాల్లో ఎవరిని పలకరించినా కంటతడిపెడుతున్నారు. కష్టాలు ఏకరువు పెడుతున్నారు. ‘ పండుగా లేదు పబ్బం లేద’ని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.



►  ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే వారికి మరిన్ని కష్టాలను తెచ్చి పెట్టింది..



►మండలంలోని బోదనం, కోళ్లూరు, చిట్యాల, చిట్యాల తండా, గొల్లపేట తదితర గ్రామాల్లోకి ఇప్పుడు పులిచింతల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది. దీంతో ఊళ్లన్నీ ఖాళీ చేసి అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది..



► మరోవైపు గ్రామాల్లోకి వచ్చేస్తున్న నీరు ఇప్పటికే పంట పొలాలను ముంచెత్తు తోంది. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పైరు వరద నీటికి మునిగిపోతుంటే కన్నీళ్లే  మిగిలాయంటున్నారు.



►ఇలాంటి పరిస్థితుల్లో ఇక పండుగలు ఎలా జరుపుకోవాలంటూ ఆ పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



►ఏ అధికారి కూడా తమవైపు రావడం లేదని, కనీసం తమ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని కంటతడిపెడుతున్నారు.



► ఏ ఇల్లు చూసినా బోసిపోయి కనిపిస్తోంది. పల్లె ప్రజల్లో ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి నష్టపరిహారం అందించడం ద్వారా పులిచింతల ముంపు గ్రామాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top