అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ ర్యాలీ
అనంతపురం : అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలు గుర్నాథరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి పాల్గొన్నారు. కాగా అనంతపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు అనంతపురం బళ్లారి రోడ్డులో రెండు ప్రయివేటు బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
కాగా రాయదుర్గంలోనూ మూడోరోజు నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు రాష్ట్ర విభజనను నిరసిస్తూ సోనియాగాంధీ, చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో బంద్ నేపథ్యంలో శుక్రవారం కూడా దుకాణాలు తెరుచుకోలేదు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఉరవకొండలోనూ నిరసనలు ఎగసిపడుతున్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించి, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖాజీపేటలో రోడ్లపై వంటావార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.