నగర పంచాయతీలకు ప్రతిపాదనలు
20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలకు అవకాశం
ఎస్ కోట, చీపురుపల్లి, కొత్తవలసలను ప్రతిపాదించేందుకు చర్యలు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో మేజర్ పంచాయతీలను నగరపంచాయతీలుగా మార్చే ప్రతిపాదన మరో మారు తెరపైకి వచ్చింది. 20 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల జాబితాను త్వరితగతిన పంపించాలని గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఎంఎం నాయక్, జిల్లా పంచాయతీ అధికారులను సంబంధిత జాబితా సిద్ధం చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరానికి కార్పొరేషన్ హోదా కల్పించేందుకు ప్రతిపాదన స్వీకరించిన ప్రభుత్వం, తాజాగా నగర పంచాయతీల మార్పునకు ప్రతిపాదనలు కోరింది. ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలకు అవకాశం జిల్లాలో కొత్తవలస, జామి, ఎస్.కోట, ధర్మవరం, కొండపాలెం, చీపురుపల్లి, గర్భాం, భోగాపురం, గజపతినగరం, రామభద్రాపురం, మక్కువ, తెర్లాం, కురుపాం, ఎల్.కోట, పెదభోగిలి మేజర్ పంచాయతీలు. వీటిలో ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చేందుకు ఇప్పటికే పలు మార్లు ప్రతిపాదించారు.
ఈ సారి కూడా వాటినే ప్రతిపాదించారు. చీపురుపల్లి మేజర్పంచాయతీలో 40 వేలు, ఎస్.కోట పంచాయతీలో 30 వేలు , కొత్తవలస మేజర్ పంచాయతీలో 35 వేల మంది జనాభా ఉన్నారు. ఈ మూడింటినీ ప్రతిపాదిస్తూ రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ రాజు తెలిపారు.
సంబంధిత వార్తలు