ప్రగతిపథంలో కేడీసీసీబీ
కర్నూలు(అగ్రికల్చర్):
కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) ప్రగతి పథంలో ఉందని ఆ బ్యాంకు చైర్పర్సన్ శ్రీదేవి అన్నారు. సోమవారం కేడీసీసీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పలువురు డెరైక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ డీసీసీబీని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చామనడానికి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.2.19 కోట్ల లాభమే నిదర్శనమన్నారు. వ్యాపారాన్ని విస్తరింపజేయడం వల్ల బ్యాంకులను లాభాల బాట పట్టించినట్లు వివరించారు. వ్యక్తిగత రుణ పరిమితిని రూ.లక్షన్నరకు పెంచుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఖరీఫ్లో పండిన వరిధాన్యాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఎంఎస్పీతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి అర్హత పొందిన రైతులు బకాయిలు చెల్లించి కొత్త రుణాలు పొందే విధంగా చూడాలని కోరారు. రైతుల సంక్షేమానికి మరింత తోడ్పాటు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. 2013-14వ వార్షిక నివేదికకు సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. కాగా సహకార సంఘాలకు ఎరువులు ఇవ్వడంలో వ్యవసాయాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్, జేడీఏల దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ వివి.సుబ్బారెడ్డి, జీఎం రామాంజనేయులు, డీజీఎంలు శివలీల, జీఎం రామాంజనేయులు, డీజీఎంలు శివలీల, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, డెరైక్టర్లు మధుసూధన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, లక్ష్మిదేవమ్మ, స్వామినాయక్, లోక్నాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.