ప్రైవేట్ ఆస్పత్రిలో పర్సు మాయం


విజయనగరం క్రైం: సినీ ఫక్కీలో పర్సు మాయమైన సంఘటన  పట్టణంలోని సాయి పీవీఆర్ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామానికి చెందిన నిడదాసి పెద్ద అప్పన్న భార్య అప్పలనారాయణకు ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుకభాగంలో ఉన్న సాయి పీవీఆర్ ఆస్పత్రిలో కొద్దిరోజుల క్రితం గైనిక్‌కు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రికి పెద్దకుమార్తెతో దంపతులిద్దరూ వెళ్లారు. పర్సులో రెండు తులాల బంగారు ఆభరణాలను, రెండు వేల నగదును ఉంచారు.

 

 అప్పలనారాయణ, తన కుమార్తెను ఆస్పత్రిలో ఉంచి పెద్ద అప్పన్న, బంధువుతో కలిసి బ్యాంకులో బంగారు వస్తువులు తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. డాక్యుమెంట్ లావాదేవీలు చేసిన తర్వాత బంగారు ఆభరణాలు బ్యాంకు తేవాలని కుమార్తెకు ఫోన్ చేశారు. కుమార్తె పర్సును మరిచి ఆస్పత్రిలోనే కొద్దిదూరం వెళ్లి వచ్చి చూసేసరికి పర్సు మామయైంది. వెంటనే ఆస్పత్రి  వైద్యులకు బాధితులు సమాచారం తెలిపారు. సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించినా ఫలితం లేకపోవడంతో బోరున విలపించారు. వెంటనే వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ హెచ్‌సీ కుమార్ ఆస్పత్రికి వచ్చి పలువురిని విచారించారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత విషయాలు  తెలుస్తాయని కుమార్ తెలిపారు.

 

 వైద్యం కోసం డబ్బులు లేకపోవడంతో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాలని భావించి విజయనగరం పట్టణానికి వచ్చిన ఆ దంపతులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆభరణాలు దాచిన పర్సు క్షణాల్లో మాయం కావడంతో ఏంచేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top