పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వండి

పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వండి - Sakshi


కర్నూలు(జిల్లా పరిషత్): ‘కాంగ్రెస్ పార్టీలో తల్లిపాలు తాగి రొమ్ముగుద్ది వెళ్లే వారు అధికమయ్యారు. ఈ పార్టీని ఉపయోగించుకుని ప్రయోజనం పొంది, కేడర్‌తో పాటు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఫలితంగా సామాన్య కార్యకర్తలకు గుర్తింపులేకుండాపోతోంది. ఇప్పటికీ కొందరు నాయకులు పార్టీలోనే ఉంటూ టీడీపీ నాయకులకు వంత పాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన తప్పుల వల్ల రాష్ట్రంలో పార్టీ సర్వనాశనమైంది. ఇప్పటికైనా పనిచేసే వారికి గుర్తింపునివ్వకపోతే మనుగడ లేకుండా పోతుంది’ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాపోయారు.

 

శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 14 నియోజకవర్గాల నాయకులు, ఇటీవల ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు గాకుండా దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసేవారికి ఇకనైనా గుర్తింపునివ్వాలని కోరారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ అధికారం వచ్చిందే తడవుగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రాన్ని, జిల్లాను దున్నేస్తున్నారని విమర్శించారు.

 

2009లో వరదలు వచ్చి కర్నూలు నగరాన్ని ప్రక్షాళన చేశాయని, ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ ఓడిపోవడం వల్ల పార్టీలో ఉన్న దరిద్రపు నాయకులంతా వెళ్లిపోయారని చెప్పారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ ఇప్పటికీ చాలా మంది మన పార్టీలో ఉంటూ ఇతర పార్టీల నాయకుల వెంట తిరుగుతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు 50 శాతంపైగా ఉన్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కోపార్టీలో ఉంటూ అధికార పార్టీ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిల్లో వార్డు కమిటీ సభ్యులుగా నిజమైన కాంగ్రెస్ వారిని ఎన్నిక చేయడం కష్టసాధ్యమన్నారు. పార్టీలో ఉంటూ గేమ్స్ ఆడే వారిని నమ్మొద్దని కోరారు.

 

కమిటీ ఏర్పాటులో అధిష్టానం జోక్యం చేసుకోదు

పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇకపై జిల్లా నుంచి వార్డుస్థాయి కమిటీ ఏర్పాటులో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోదని, స్థానిక నాయకులకే వదిలేస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. మండల, నగర, సిటీ కమిటీల ఏర్పాటు విషయంలో పీసీసీ సమన్వయకర్తలుగా నరసింహారెడ్డి, రవిచంద్రారెడ్డి, అజయ్‌కుమార్ వ్యవహరిస్తారన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్నూలు నగరంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ చేతగాని తనాన్ని ఎత్తిచూపుతూ ప్రజల్లో విశ్వాసం పొందాలని చెప్పారు.

 

రుణమాఫీ విషయాన్ని, అధికార దాహంతో తెలుగుదేశం నాయకులు బెదిరింపులకు దిగుతున్నా అంశాలను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీకి బలోపేతం చేయాలని సూచించారు. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలు మారిన వారికి ప్రజలు ఓటమితో తగిన బుద్ధి చెప్పారన్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బీవీ రామయ్య, ఉపాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top