విద్యుత్ లైన్ల తరలింపునకు చర్యలు


కర్నూలు(అగ్రికల్చర్): డిఫెన్స్ రీసెర్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) నెలకొల్పే ప్రాజెక్టు భూముల్లో ఉన్న ట్రాన్స్‌కో హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లను తరలించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు  ఆదేశించారు.

 

 శనివారం డీఆర్‌డీఓ బృందం సభ్యులు డాక్టర్ రామకృష్ణారావు, భాస్కర్, బాల ఆచారులు.. ఓర్వకల్లు మండలంలోని పాలకొలను, ఉప్పలపాడు, ఎన్.కొంతలపాడు, ఉయ్యాలవాడ, కాల్వ, వెల్దుర్తి మండలంలోని బుక్కాపురం గ్రామాల్లో గుర్తించిన 2900 ఎకరాల భూములను పరిశీలించారు. అనంతరం జేసీతో ఆయన చాంబర్‌లో సమావేశమయ్యారు. డీఆర్‌డీఓకు కేటాయించిన 2900 ఎకరాల్లో ట్రాన్స్‌కోకు సంబంధించి 2 హెచ్‌టీ లైన్‌లు, 1 ఎల్‌టీ లైన్లు ఉన్నాయని.. వీటిని షిఫ్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ టీమ్ ప్రతినిధి రామకృష్ణారావు జేసీని కోరారు.

 

 ఈమేరకు డీఆర్‌డీఓ నుంచి ట్రాన్స్‌కోకు ప్రతిపాదనలు ఇవ్వాలని జేసీ సూచించారు. వీటిని వేరే ప్రాంతాలకు తరలించేందుకు తగిన అంచనాలు రూపొందించాలని జేసీ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఇందుకు అవసరమైన ఎస్టిమేట్‌లు ఇవ్వాలన్నారు. లైన్‌లు తరలించడానికి అవసరమైన నిధులను డీఆర్‌డీఓ చెల్లిస్తుందని తెలిపారు. విద్యుత్ లైన్లను తరలిస్తే డీఆర్‌డీఓ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభిస్తుందని తెలిపారు. సమావేశంలో ట్రాన్స్‌కో, విద్యుత్ అధికారులు ఓర్వకల్లు, వెల్దుర్తి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top