పోరంబోకుల దందా 1200 కాదు... 1350 ఎకరాలు

పోరంబోకుల దందా  1200 కాదు... 1350 ఎకరాలు


* తేల్చిన రెవెన్యూ అధికారులు

* పోరంబోకుల దందా కథనానికి స్పందన

* కదిలిన రెవెన్యూ యంత్రాంగం

* ఆక్రమణదారులపై కేసులు పెడతాం: తహశీల్దార్


తర్లుపాడు : పోరంబోకు భూమి ఆక్రమణ 1200 కాదు 1350 ఎకరాలంటూ రెవెన్యూ అధికారులే సర్వే చేసి లెక్క తేల్చారు.  మండలంలోని గానుగపెంట గ్రామంలో పశువుల మేత పోరంబోకు భూములను ఆక్రమించుకున్న వైనాన్ని ‘సాక్షి’ ఒంగోలు జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో ‘పోరంబోకుల దందా’ శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది.  గురువారం గ్రామాల్లో ఆక్రమిత ప్రాంతాలను ఆర్.ఐ. బి.శ్రీనివాస్, వీఆర్వో నాగేశ్వరరావులు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు.



సుమారు 1350 ఎకరాలకుపైగా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కబ్జాదారులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తహశీల్దార్ కేవీఆర్‌వీ ప్రసాదరావు తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప తామేమీ చేయలేమని తహశీల్దార్ ముందు వీఆర్వో చేతులెత్తేశారు. పోలీసు రక్షణతో వెళ్తే తప్ప ఆక్రమణలను తొలగించలేమని స్థానిక అధికారులు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయక తప్పదనే నిర్ణయానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఆక్రమించిన భూముల ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రసాదరావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top