పేదల ఇళ్లకు చంద్ర గ్రహణం

పేదల ఇళ్లకు చంద్ర గ్రహణం - Sakshi


 శ్రీకాకుళం పాత బస్టాండ్, ఎల్.ఎన్.పేట: ‘మీ సొంతింటి కల నెలవేరాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. ఇందిరమ్మ ఇంటికి ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని రూ. 1.50 లక్షలకు పెంచుతాం. ఇది మా పార్టీ ఎజెండా’.. అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించింది. మొత్తంగా ఇళ్ల నిర్మాణ పథకానికే కాలదోషం పట్టిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్,రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం క్రమంగా మంగళం పాడేట్లు కనిపిస్తోంది. ఈ పధకం ద్వారా పేదలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో పట్టణ,  గ్రామ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించి పక్కా ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించారు.  ఇలా 2007 నుంచి మూడు విడతల్లో జిల్లాలో సుమారు 3 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిరాసక్తత కారణంగా ఇప్పటికీ సగం ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. 44,655 ఇళ్ల నిర్మాణాలు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ ప్రారంభం కానేలేదు.

 

 అసంపూర్తిగా నిర్మాణాలు

 ఇక ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఏమూలకు సరిపోగా సుమారు. 1.10 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ ధశల్లో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అష్టకష్టాలు పడి నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన లబ్ధిదారులు డబ్బులు అందుతాయో లేదోనన్న భయంతో నిర్మాణాలను ఎక్కడివక్కడ నిలిపివేశారు. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఇలా అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు కనిపిస్తున్నాయి.

 

 ఎన్నికల కోడ్‌తో కష్టాలు మొదలు

 ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఒక మోస్తరుగా సాగిన ఇళ్ల నిర్మాణాలు అదే నెలల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడి, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బిల్లుల మంజూరును అధికారులు నిలిపివేశారు. కాగా ఇళ్ల నిర్మాణ యూనిట్ విలువను రూ.1.50 లక్షలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందించారు. అయితే ఎన్నికలు ముగిసి, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలుకే ఎసరు పెట్టేలా పరిస్థితి తయాైరె ంది. యూనిట్ విలువ పెంచడమేమో గానీ.. ప్రభుత్వం పాత బకాయిల ఊసెత్తకపోగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన కొత్త ఇళ్ల మంజూరును సైతం నిలిపివేసింది. గతంలో ఇళ్ల మం జూరులో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ ఏమైందోగానీ.. ఇళ్ల పరిస్థితిలో మాత్రం మార్పులేదు. ప్రభుత్వమూ స్పందించడం లేదు.

 

 సిబ్బంది కుదింపు

 గృహనిర్మాణ సంస్థలో సిబ్బందిని భారీగా తగ్గించడం కూడా ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంస్థలో ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, వర్క్ ఇన్‌స్పెక్టర్, అటెండర్ తదితర పోస్టుల్లో పని చేస్తున్న 124 మందిని తొలగించారు. దీంతో పని చేసేవారు కూడా ఈ శాఖలో కరువయ్యారు. మిగిలిన రెగ్యులర్ సిబ్బంది 2004 నుంచి ఇప్పటి వరకూ మంజూరైన ఇళ్ళు లబ్ధిదారుల పేర్లకు ఆధార్ అనుసంధానం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కొత్తగా ఇళ్ల మంజూరు లేదు.. నిర్మాణాలు జరగడం లేదు, బిల్లులు విడుదల కాలేదు.. వెరసి గత ఫిబ్రవరి నుంచి ఈ శాఖ పూర్తిగా స్తంభించిపోయినట్లయ్యింది.

 

 రూ. 14 కోట్ల బకాయిలు

 గృహనిర్మాణ శాఖ గత రెండేళ్లుగా లక్ష్యాలను చేరడం లేదు. 2013-14 లో 23వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించగా 17వేల ఇళ్లు మాత్రమే నిర్మించగలిగారు. వీటికి సంబంధించి బిల్లుల విడుదలలో కూడా జాప్యం జరగడంతో నిర్మాణాలు మందకొడిగా సాగాయి. నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు *14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో(2014-15) నియోజకవర్గానికి రెండు వేలు చొప్పున జిల్లాలో 20వేల ఇళ్లు నిర్మించాలని అధికారులు ప్రాతిపదించారు. అయితే ఆర్థిక సంవత్సరం మొదలై ఐదు నెలలు గడిచిపోయినా ఈ ఇళ్లు మంజూరు కాకపోవడం, పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఇంటి నిర్మాణం చేపట్టాలంటేనే లబ్ధిదారులు భయపడిపోతున్నారు. కాగా ప్రభుత్వం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి సుమారు 42వేల ఇళ్ల కోసం అందిన వినతిపత్రాలు కార్యాలయాల్లోనే ముగ్గుతున్నాయి.

 

 ఈ ఏడాదికి కొత్త ఇళ్లు లేనట్లే!

 ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇళ్లు మంజూరయ్యే అవకాశం లేనట్లేనని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోవడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, పాత బకాయిలే చెల్లించే పరిస్థితి లేకపోవడం, అవకతవకల పేరుతో విచారణ తదితర అం శాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయంటున్నారు. కొత్త వాటి సం గతి అటుంచితే ఇప్పటికే పూర్తి అయిన, నిర్మాణంలో ఉన్న ఇళ్ల బిల్లులైన చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top